
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడిన సీఎస్కే.. కేవలం రెండు విజయాలు మాత్రమే అందుకుంది. ప్రస్తుతం 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. ఇప్పటికే లీగ్ దశలో దాదాపుగా సగం మ్యాచ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే.. ఇకపై ప్రతి మ్యాచ్ సీఎస్కేకు అత్యంత కీలకం. ఒక్కో మ్యాచ్ ఓడిపోతే.. ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతుంటాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 23న వాంఖడేలో ముంబై ఇండియన్స్ (ఎంఐ)పై గెలవడం తప్పనిసరి.
మరోవైపు ముంబై ఇండియన్స్ కూడా సీఎస్కే లాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. తాజాగా గుజరాత్ టైటాన్స్పై విజయం సాధించి 4 పాయింట్లతో తిరిగి పోటీలోకి వచ్చింది. ముంబై జట్టుకు మంచి కాంబినేషన్ ఉండటంతో.. బలంగా తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో ముంబైకి కూడా సీఎస్కేతో జరగనున్న మ్యాచ్ కీలకం కానుంది. సీఎస్కే, ఎంఐ మ్యాచ్లో గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓడిన జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిలుతాయి.
Also Read: Tilak Varma: తొలి 19 బంతుల్లో 0.. తర్వాతి 23 బంతుల్లో విధ్వంసం.. తిలక్ బ్యాటింగ్ సాగిందిలా!
ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ 11 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేసులో ముందంజలో ఉంది. అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు 8 పాయింట్లతో బలమైన స్థితిలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సీఎస్కే ప్లే ఆఫ్స్కు చేరాలంటే.. ఇకపై తప్పనిసరిగా వరుస విజయాలు సాధించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ముంబైపై జరిగే మ్యాచ్లో గెలిస్తే సీఎస్కే 6 పాయింట్లకు చేరుకుని ఆశలను సజీవంగా ఉంచుకోగలదు. అదే సమయంలో ముంబైని 4 పాయింట్ల వద్దే ఉంటుంది. ఓడిపోతే సీఎస్కే ప్లే ఆఫ్స్ ఆశలు ప్రమాదంలో ఉంటాయి. ఈ కీలక సమయంలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఎలా జట్టును నడిపిస్తాడో చూడాలి. మొత్తానికి సీఎస్కేకు ఇది డూ ఆర్ డై పరిస్థితి అనే చెప్పాలి.