Reading Time: < 1 minute
Ap Ministers To Undergo Training In Singapore For Good Governance

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సుపరిపాలనను బలోపేతం చేయడం, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడం లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పరిపాలనలో ఆధునిక విధానాలు, ఆర్థిక వృద్ధి వ్యూహాలు, ప్రజా సేవల మెరుగుదల వంటి అంశాలపై మంత్రులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన తొమ్మిది మంది మంత్రుల బృందం ఈ నెల 21 నుంచి 27 వరకు సింగపూర్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో పాలన, ఆర్థికాభివృద్ధి, నగరాభివృద్ధి, ప్రజా సేవల నిర్వహణ తదితర అంశాలపై నిపుణుల నుంచి శిక్షణ పొందనున్నారు.

Read Also: IPL 2026: తారలు దిగివచ్చిన వేళ.. ముంబై వర్సెస్ బెంగళూరు పోరులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది వీరే!

సింగపూర్ పర్యటనకు వెళ్లనున్న మంత్రుల్లో నారాయణ, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు ఉన్నారు. మంత్రులతో పాటు రాష్ట్ర ప్రణాళిక విభాగానికి చెందిన సీనియర్ అధికారులు కూడా ఈ పర్యటనలో పాల్గొననున్నారు. సింగపూర్‌లో శిక్షణ పూర్తి చేసుకుని వచ్చిన అనంతరం, అక్కడ నేర్చుకున్న అంశాలను రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు పాలనా వ్యవస్థలోని ఇతర విభాగాలకు అందించేలా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ‘స్వర్ణాంధ్ర 2047 విజన్’ అమలులో భాగంగానే ఈ శిక్షణా పర్యటనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర పరిపాలనను తీర్చిదిద్దడం, అంతర్జాతీయ ప్రమాణాల సేవలను అందించడం లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.