Reading Time: 2 minutes
Jbl Earbuds Burst Rajasthan Student Safety Concerns

Earbud Burst: రాజస్థాన్‌కు చెందిన ఒక విద్యార్థిని చెవిలో ఇయర్‌బడ్ పేలిపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ ఆడియో బ్రాండ్ జేబీఎల్‌కు చెందిన ఇయర్‌బడ్ తన చెవిలోనే పేలిందని ఆమె ఆరోపించడం సంచలనంగా మారింది. ఈ ఘటన తర్వాత వైర్‌లెస్ డివైజ్‌ల భద్రతపై అనేక కొత్త ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జేబీఎల్ ట్యూన్ బీమ్ 2 ఇయర్‌బడ్‌ను తాను ఉపయోగించినట్లు ఆమె పేర్కొంది. ఆకాస్మత్తుగా పనిచేయడం ఆపేసిందని, కేవలం 15 నిమిషాల పాటు సాధారణ వాల్యూమ్ తోనే వింటున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని ఆరోపించింది. పేలిపోవడానికి ముందు తనకు డ్రిల్లింగ్ మెషీన్ లాంటి ఫీలింగ్ వచ్చిందని ఆమె పేర్కొంది.

Read Also: Gopichand33: మ్యాచో స్టార్ గోపీచంద్ 33వ సినిమా అప్‌డేట్..

చెవిలో ఇయర్‌డ్రమ్(టింపానిక్ మెమ్‌బ్రేన్)లో వాపు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. చెవి లోపల పేలడంతో కర్ణభేరి వాపుకు గురైందని తెలిపారు. దీని వల్ల నొప్పి, అసౌకర్యం ఏర్పడినట్లు చెప్పారు. ఈ ఘటనపై స్టూడెంట్ ఫోటోలు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. జేబీఎల్ సరైన నాణ్యత లేని ప్రొడక్ట్ తయారు చేసిందని ఆమె ఆరోపించారు. నెల రోజుల క్రితం ఈ పరికరాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. వీటి వివరాలను కూడా ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.

అయితే, ఈ ఘటనపై జేబీఎల్ విచారణ ప్రారంభించింది. విద్యార్థిని సోషల్ మీడియా పోస్ట్‌పై కంపెనీ స్పందిస్తూ.. ‘‘ మీ పరిస్థితి గురించి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు, మేము మీ పోస్ట్ చూసి, తదుపరి చర్యలు తీసుకోవడానికి భారత్‌లోని మా టీంను మిమ్మల్ని నేరుగా సందప్రదిస్తుంది’’ అని రాసింది. స్టూడెంట్ పెట్టిన పోస్ట్‌పై నెటిజన్లు చాలా మంది స్పందించారు. కన్జూమర్ కోర్టుకు వెళ్లాల్సిందిగా ఒకరు సలహా ఇచ్చారు. భద్రత విషయంలో రాజీపడకూడదని పలువురు నెటిజన్లు జేబీఎల్‌కు సూచించారు.