Reading Time: 2 minutes
Gt Vs Dc Ipl 2026 Last Ball Thriller Match Highlights

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన పోరు క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లలో ఒకటిగా నిలిచిపోయింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ హై-స్కోరింగ్ మ్యాచ్‌లో చివరి బంతి వరకు విజయం ఎవరిని వరిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరును సాధించింది. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ తన కెరీర్‌లో అద్భుతమైన ఫామ్‌ను కనబరుస్తూ మొదటి అర్థ సెంచరీతో జట్టుకు భారీ స్కోరును అందించగా, గిల్ తనదైన శైలిలో మెరుపులు మెరిపించారు. 211 పరుగుల క్లిష్టమైన లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆరంభంలోనే నిస్సాంకా వేగంగా పరుగులు రాబట్టి ఆశలు రేకెత్తించాడు.

అయితే ఈ మ్యాచ్‌కు అసలైన ఆకర్షణ కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్. బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడిన రాహుల్, కేవలం 52 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 92 పరుగులు చేసి జట్టును దాదాపు విజయతీరాలకు చేర్చారు. సెంచరీకి అతివలువలో ఉన్న దశలో సిరాజ్ వేసిన అద్భుతమైన బంతికి రాహుల్ పెవిలియన్ చేరడంతో మ్యాచ్ ఒక్కసారిగా గుజరాత్ వైపు మొగ్గు చూపింది. కానీ, డేవిడ్ మిల్లర్ క్రీజులోకి రావడంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. గాయంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ మిల్లర్ ఆఖరి ఓవర్లలో సిరాజ్ బౌలింగ్‌ను చీల్చిచెండాడు. సిక్సర్లు , ఫోర్ల వర్షం కురిపించడంతో ఢిల్లీ విజయం ఖాయమని అందరూ భావించారు. ఆఖరి ఓవర్‌లో ఢిల్లీ గెలవడానికి 13 పరుగులు అవసరమవ్వగా, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ బాధ్యతలు చేపట్టారు.

ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఆఖరి ఓవర్ మొదటి బంతికే విప్రజ్ నిగమ్ ఫోర్ కొట్టడంతో స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. అయితే రెండో బంతికి నిగమ్ అవుట్ కావడంతో ఉత్కంఠ పరాకాష్టకు చేరింది. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ సింగిల్ తీసి స్ట్రైకింగ్‌ను మిల్లర్‌కు ఇచ్చాడు. నాలుగో బంతిని మిల్లర్ స్టేడియం వెలుపలకు పంపడంతో ఢిల్లీ విజయానికి చివరి రెండు బంతుల్లో కేవలం రెండు పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. ఆ ఐదో బంతిని మిల్లర్ వదిలేయడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన స్థితిలో మిల్లర్ షాట్‌ను మిస్ చేయగా, సింగిల్ తీసే క్రమంలో కుల్దీప్ యాదవ్ రన్ అవుట్ అయ్యాడు. అంపైర్లు ఆ బంతిని ఎత్తు కారణంగా నో-బాల్‌గా పరిగణిస్తారేమోనని కాసేపు ఉత్కంఠ నెలకొన్నప్పటికీ, అది సరైన బంతి అని తేలడంతో గుజరాత్ టైటాన్స్ కేవలం ఒక్క పరుగు తేడాతో అపురూప విజయాన్ని సొంతం చేసుకుంది. రాహుల్ , మిల్లర్ శ్రమ వృథా అయినప్పటికీ, ఈ మ్యాచ్ అభిమానులకు అసలైన క్రికెట్ వినోదాన్ని పంచింది.