Reading Time: 2 minutes
Ponguleti Srinivas Reddy Attack Brs Nadargul Land Controversy

తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ముఖ్యంగా నాదర్‌గుల్ భూముల వ్యవహారం , మంత్రులపై వస్తున్న ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతలను ‘అబద్ధాల రావు’, ‘డ్రామాల రావు’ అని సంబోధిస్తూ, వారు చేస్తున్న విమర్శలను అసత్యాల పుట్టగా అభివర్ణించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో తమ పార్టీ విజయం ఖాయమని పేర్కొన్న ఆయన, కేరళలో యుడిఎఫ్ (UDF) కూటమి అద్భుతమైన మెజార్టీతో అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను కేరళ ప్రజలకు వివరించామని, అక్కడ కూడా ప్రజా ప్రభుత్వానికి విశేష ఆదరణ లభిస్తోందని ఆయన తెలిపారు.

HPV వైరస్ అలర్ట్.. చిన్న వయస్సులోనే టీకా తీసుకోకపోతే క్యాన్సర్ ముప్పు.!

నాదర్‌గుల్ గ్రామంలోని సర్వే నంబర్ 613లో గల 370 ఎకరాల భూమిపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను సాక్ష్యాధారాలతో తిప్పికొట్టిన మంత్రి, ఈ భూమి బాగోతం మొత్తం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని స్పష్టం చేశారు. 2014లోనే మూడు సంస్థలకు ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా, 2016లో మ్యుటేషన్ పూర్తి చేసింది కూడా గత దొరల పాలనేనని ఆయన గుర్తు చేశారు. గూగుల్ మ్యాప్స్ సాక్ష్యాలను బయటపెడుతూ, 2021 వరకు ఖాళీగా ఉన్న ఈ భూమిలో 2022 నాటికి రోడ్లు నిర్మించి, రేకుల షెడ్లు వేయించింది బీఆర్ఎస్ నాయకులేనని మండిపడ్డారు. ఈ భూమి విషయంలో గత ప్రభుత్వం కోర్టులో కౌంటర్ వేయకుండా నిర్లక్ష్యం వహించిందని, కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 మార్చి 15న ప్రభుత్వ పక్షాన గట్టిగా కౌంటర్ దాఖలు చేసిందని వెల్లడించారు.

Junior NTR : ఎక్స్‌ను షేక్ చేస్తున్న ఎన్టీఆర్ ట్వీట్.. ‘బావా’ అంటూ స్పెషల్ పోస్ట్!

తమ పార్టీ మంత్రులపై బురద జల్లడం ద్వారా తమ కుటుంబ ఆస్తుల పెంపు, పంపకాల చర్చను పక్కదారి పట్టించాలని ప్రతిపక్ష నాయకులు ప్రయత్నిస్తున్నారని పొంగులేటి ఆరోపించారు. గత పదేళ్లలో వారి ఆస్తులు ఎంత మేర పెరిగాయో ప్రజల్లో చర్చ జరుగుతుందనే భయంతోనే ‘శకుని మామ’ (హరీష్ రావు) వంటి వారు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి క్లీన్ ఇమేజ్ ఉన్న నేతలపై బియ్యం స్కామ్ అంటూ తప్పుడు నిందలు వేస్తున్నారని, సన్న బియ్యం పథకానికి వస్తున్న ప్రజాదరణను వారు తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ఏదైనా కమిటీ వేయడానికి ముఖ్యమంత్రి సిద్ధమని ప్రకటించినప్పుడు సమాధానం చెప్పలేక తోక ముడిచి పారిపోయిన వారు, ఇప్పుడు బయట డ్రామాలు ఆడుతున్నారని మంత్రి పొంగులేటి ఎద్దేవా చేశారు.