Reading Time: < 1 minute
Telangana Petrol Diesel Lpg Supply Updates Stephen Raveendra Clarification

తెలంగాణలో పెట్రోల్, డీజిల్ , వంటగ్యాస్ సరఫరాపై వస్తున్న వదంతులను సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కొట్టిపారేశారు. రాష్ట్రంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియాకు కీలక విషయాలను వెల్లడించారు. నిన్న ఒక్కరోజే ఆయిల్ కంపెనీలు 2123 ట్యాంకర్ల ద్వారా పెట్రోల్‌ను సరఫరా చేశాయి. సాధారణంగా రాష్ట్రంలో రోజువారీ పెట్రోల్ వినియోగం 5883 కిలో లీటర్లు ఉండగా, నిన్న ఏకంగా 10,799 కిలో లీటర్లను పంపిణీ చేశారు. అంటే సాధారణం కంటే 84 శాతం అదనంగా సరఫరా జరిగింది. అలాగే 22,127 కిలో లీటర్ల డీజిల్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్‌లోని 596 అవుట్‌లెట్ల వద్ద రద్దీని తగ్గించేందుకు సివిల్ సప్లై, రెవెన్యూ, పోలీస్ , లీగల్ మెట్రాలజీ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. దీనివల్ల నిన్నటితో పోలిస్తే ఈరోజు బంకుల వద్ద రద్దీ గణనీయంగా తగ్గింది.

Also Read:Prabhas-Mahesh Babu: నమ్మొచ్చా.. ‘భైరవ-రుద్ర’ సేమ్ టు సేమ్ అట!?

రాష్ట్రంలో 1.28 కోట్లకు పైగా డొమెస్టిక్ ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయి. రోజుకు సగటున 2.20 లక్షల బుకింగ్స్ జరుగుతుండగా.. నిన్న 2,19,980 సిలిండర్లను వినియోగదారులకు చేరవేశారు. అయితే.. కొరత ఉందన్న భయంతో వినియోగదారులు ఒకేసారి పెద్ద సంఖ్యలో బుకింగ్స్ చేయడం వల్ల కొంత ఒత్తిడి ఏర్పడుతోందని.. నిల్వలు సరిపడా ఉన్నాయని ఆయన వివరించారు. మరోవైపు 1.03 లక్షల పీఎన్జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్) కనెక్షన్ల ద్వారా 2.78 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిరంతరాయంగా అందుబాటులో ఉందన్నారు.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పీఎన్జీ, సీఎన్జీ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించాలని నిర్ణయించారు. కొత్త ప్లాంట్లకు 24 గంటల్లోనే అనుమతులు ఇవ్వడంతో పాటు పలు రాయితీలు కల్పించనున్నారు. రాబోయే 60 రోజులకు సరిపడా స్టాక్ ఉందని, సోషల్ మీడియా వదంతులను నమ్మి అనవసరంగా నిల్వ చేసుకోవద్దని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.