Reading Time: < 1 minute
Minister Nadendla Manohar Issues Key Directives On Lpg Cylinder Deliveries

LPG Shortage: ఆంధ్రప్రదేశ్‌లో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై కీలక ఆదేశాలు జారీ చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్‌.. రాష్ట్రంలో ఎలాంటి అంతరాయం లేదన్న ఆయన.. ప్రజలు గ్యాస్ కొరతపై భయాందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో ప్రతిరోజూ సమీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న అపోహలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2,00,479 ఎల్పీజీ సిలిండర్ల డెలివరీలు జరిగాయని వెల్లడించారు.

అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో, ముఖ్యంగా Qatarలో జరిగిన ఘటనల కారణంగా ఆయిల్, గ్యాస్ సరఫరాలపై ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. అయితే ప్రస్తుతానికి ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేశారు. అర్బన్ ప్రాంతాల్లో పైప్ నేచురల్ గ్యాస్ (PNG) వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ దిశగా సుమారు 60 వేల మంది వినియోగదారులకు PNG అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్లు, సివిల్ సప్లై అధికారులకు ప్రత్యేక మార్గదర్శకాలు (SOP) జారీ చేయనున్నట్లు మంత్రి చెప్పారు. హాస్టళ్లు, ఆస్పత్రులు, అన్న క్యాంటీన్లు, కొన్ని హోటళ్లకు ప్రాధాన్యతతో గ్యాస్ సరఫరా చేయాలని సూచించారు.

ఇక, డొమెస్టిక్ సిలిండర్ల దుర్వినియోగాన్ని నివారించాలని హెచ్చరించిన మంత్రి నాదెండ్ల.. OTP విధానంలోనే డెలివరీ జరుగుతుందని స్పష్టం చేశారు. అనవసరంగా గ్యాస్ ఏజెన్సీల వద్ద గుమ్మి కూడవద్దని ప్రజలను కోరారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఇప్పటికే 54 వేల ఇండక్షన్ స్టవ్స్ పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రత్యామ్నాయ ఇంధనాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందని, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అనవసర అపోహల కారణంగా గ్యాస్ బుకింగ్స్ పెరిగి సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోందని మంత్రి అన్నారు. ఎక్కడైనా సిలిండర్ల డైవర్షన్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే 9 మందిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మొత్తం మీద, రాష్ట్రంలో గ్యాస్ సరఫరా సవ్యంగా కొనసాగుతోందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్‌..