Reading Time: < 1 minute
Ys Jagan Highlights Ysrcp Struggles Slams Chandrababu Over Governance

ఒంగోలు నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై కీలక సూచనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తున్నామని, వాటిలో భాగంగానే ఈ సమావేశం నిర్వహించామని తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఒక్కరిది కాదని, వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రేమించే ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా నిర్మించిన పార్టీ అని జగన్ పేర్కొన్నారు. పార్టీ విలువలు, విశ్వసనీయత మీదే పుట్టిందని.. అదే పునాదులపై ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.

గత 16 సంవత్సరాల్లో ప్రజల తరఫున అనేక పోరాటాలు చేశామని, గుండెధైర్యమే వైసీపీ ట్రేడ్ మార్క్ అని వైఎస్ జగన్ చెప్పారు. తమ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను తుచా తప్పకుండా అమలు చేశామని తెలిపారు. మేనిఫెస్టోను కచ్చితంగా పాటిస్తూ ముందుగానే క్యాలెండర్ ప్రకటించి పథకాలను అమలు చేసినట్టు గుర్తు చేశారు. ఆర్థిక ఒత్తిళ్లు, కోవిడ్ వంటి సంక్షోభాల మధ్య కూడా పేదలు, మధ్యతరగతి ప్రజలకు అండగా నిలిచామన్నారు. వైసీపీ హయాంలో తీసుకున్న అప్పుల్లో పెద్ద భాగాన్ని నేరుగా ప్రజల ఖాతాల్లోకి పంపించామని పేర్కొన్నారు.

Also Read: YS Jagan: పార్లమెంట్ చరిత్రలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీ పుట్టానే.. సీఎం నో యాక్షన్‌!

ప్రస్తుత ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ.. సీఎంచంద్రబాబు హామీలను నిలబెట్టుకోలేకపోయారని వైఎస్ జగన్ ఆరోపించారు. రెండేళ్లలోనే భారీ అప్పులు చేసినప్పటికీ ప్రజలకు ఉపయోగపడే విధంగా వాటిని వినియోగించలేదని విమర్శించారు. తమ ప్రభుత్వ పథకాలను రద్దు చేసి ప్రజలను నిరాశపరిచారని అన్నారు. అమరావతి అభివృద్ధి పనుల్లో అవినీతి జరుగుతోందని జగన్ ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదని, దోపిడీ పెరిగిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారిందని విమర్శించారు. ఈ సందర్భంగా చుండూరు రవికి తన పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. కార్యకర్తలు అందరూ ఐక్యంగా పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ప్రజలతో మరింత దగ్గరగా ఉండి, వారి సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు సాగాలని జగన్ సూచించారు.