Reading Time: 2 minutes
Punganur Tragedy Four Die After Carbon Monoxide Leak From Bike Engine Left On Overnight

అన్నమయ్య జిల్లా పుంగనూరులో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. బైక్ ఇంజన్ రన్ అవ్వాలని రాత్రంతా ఆన్‌లో ఉంచిన మోటార్ సైకిల్ నుంచి వచ్చిన కార్బన్ మోనాక్సైడ్ పొగ గదంతా వ్యాపించి పెద్దాయనతో పాటు ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారేసరికి తలుపులు తీయకపోవడంతో.. అనుమానం వచ్చిన స్థానికులు తలుపులు పగలగొట్టి చూడగా, ఆ కుటుంబం అంతా శాశ్వత నిద్రలోకి జారిపోయిన దృశ్యం చూసి గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది.

పుంగనూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో స్థానికంగా వ్యాపారం చేసుకునే మురళి తన హీరో హోండా మోటార్ సైకిల్ ఇంజన్ బోర్ చేయించుకున్నాడు. మెకానిక్ సూచన మేరకు ఇంజన్ రన్ అవ్వాలని రాత్రంతా బైక్‌ను ఆన్‌లో ఉంచి ఇంట్లోనే పెట్టాడు. ఆ గదిలోనే తన తండ్రి సహా ముగ్గురు పిల్లలు నిద్రపోయారు‌. కిటికీలు లేని చిన్న గదిలో బైక్ నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పొగ నెమ్మదిగా గదంతా కమ్ముకుంది. అదే గదిలో గాఢ నిద్రలో ఉన్న మురళి తండ్రి రామచంద్రతో పాటు ముగ్గురు చిన్నారులు ఆ విషపూరిత పొగ పీల్చి శ్వాస తీసుకోలేక ప్రాణాలు కోల్పోయారు.

ఉదయం ఎంత పిలిచినా తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా, అప్పటికే నలుగురు విగతజీవులుగా పడి ఉండటం చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నలుగురు ప్రాణాలను బలితీసుకున్న కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి గుర్తు చేసిందని స్దానికులు చేబుతున్నారు. ‘సైలెంట్ కిల్లర్’ అని పిలిచే కార్బన్ మోనాక్సైడ్‌కు వాసన ఉండదు, రంగు ఉండదు. అందువల్ల గదిలో వ్యాపిస్తున్నా మనిషికి వెంటనే గుర్తించడం చాలా కష్టం.

Also Read: Golden Era of Indian Cricket: భారత క్రికెట్‌లో స్వర్ణయుగం.. రెండు సంవత్సరాల్లో 8 అంతర్జాతీయ ట్రోఫీలు!

సాధారణంగా బైక్‌లు, కార్లు, జనరేటర్లు వంటి ఇంధనం కాల్చే యంత్రాల నుంచి కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ విడుదల అవుతుంది. మూసివేసిన గదుల్లో ఈ గ్యాస్ త్వరగా పేరుకుపోతుంది. మనం శ్వాస తీసుకున్నప్పుడు అది రక్తంలోకి చేరి హీమోగ్లోబిన్‌తో కలిసిపోతుంది. దీంతో శరీరానికి అవసరమైన ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. మొదట తలనొప్పి, తల తిరగడం, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. తరువాత మత్తు లాంటి స్థితి ఏర్పడి, కొద్ది సేపట్లోనే శ్వాస ఆడక ప్రాణాపాయం ఏర్పడుతుంది. ముఖ్యంగా నిద్రలో ఉన్నవారికి ప్రమాదం ఏమిటో తెలియకుండానే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే బైక్, కారు లేదా జనరేటర్ వంటి వాహనాలను మూసివేసిన గదుల్లో ఆన్‌లో ఉంచకూడదని హెచ్చరిస్తున్నారు. అలా చేసిన చిన్నపాటి నిర్లక్ష్యమే నలుగురు ప్రాణాలు తీసింది.