
మూడు ప్రాంతాలే లక్షంగా వైమానిక దళాల బీభత్సం
లెబనాన్ గ్రామాలపై వైట్ ఫాస్పరస్ బాంబుల ప్రయోగం
టర్కీ, దోహాపైకి ఇరాన్ క్షిపణులు, అడ్డుకున్న టర్కీ
గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తే ఇరాన్కు తగిన శాస్తి తప్పదు: యుఎఇ
టెల్అవీవ్/దుబాయి : ఇరాన్, లెబనాన్లపై ఇజ్రాయెల్ సోమవారంనాడు భారీ ఎత్తున దాడులకు పూనుకుంది. టెహ్రాన్, ఇస్ఫహాన్, దక్షిణ ఇరాన్లపై వైమానిక దాడులు జరిపినట్లు ప్రకటించింది. ఇరాన్లోని మూడు కీలక ప్రాంతాల్లో దాడులు జరుపుతున్నాం అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడిఎఫ్) ఒక ప్రకటనలో తెలిపింది. ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్కు చెందిన కమాండ్ సెంటర్తో పాటు ఇస్ఫహాన్లోని దాని వలంటరీ బసిజ్ ఫోర్స్ను లక్షంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. అయితే ఈ దాడులపై ఇరాన్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. లెబనాన్లోని దక్షిణ ప్రాంతాల్లో కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది.
బీరుట్ మీదుగా నింగిలో పెద్ద ఎత్తున నల్లని పొగలు వెలువడ్డాయి. అంతకుముందు ఇజ్రాయెల్ ఆర్మీ ఒక ప్రకటన చేసింది. హెజ్బొల్లాల ఆర్థిక మూలాలు దెబ్బతీసే విధంగా దాడులు జరపబోతున్నట్లు ప్రకటించింది. బీరుట్ దక్షిణాది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది. లెబనాన్పై దాడుల్లో ఇజ్రాయెల్ వైట్ పాస్ఫరస్తో కూడిన బాంబులు జారవిడిచినట్లు మానవ హక్కుల సంస్థ ప్రకటించింది. గ్రామాలపై చట్ట విరుద్ధంగా ఇలాంటి దాడులకు పాల్పడడమేంటని ప్రశ్నించింది. మరోవైపు ఇరాన్ క్షిపణి దాడిలో తమ పౌరుడు ఒకరు మరణించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 11కు చేరినట్లు వెల్లడించింది. ఇరాన్కు చెందని ఓ క్షిపణిని నేలకూల్చినట్లు టర్కీ ప్రకటించింది. దోహాలోనూ పేలుళ్ల శబ్దాలు వెలువడినట్లు తెలుస్తోంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ ఇలాగే దాడులు కొనసాగిస్తే ఊహించనంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
భారతీయుడికి గాయాలు..
ఇజ్రాయెల్ లక్షంగా ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో ఓ భారతీయుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షిపణి శకలాలు మీద పడడంతో అతడి మెడపై గాయాలయ్యాయని, టెల్ అవీవ్లోని ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. భారతీయుడికి శస్త్ర చికిత్స అవసరం పడడంతో వైద్యులు దానిని విజయవంతంగా పూర్తి చేశారని, ఇప్పుడు అతడి పరిస్థితి నిలకడగా ఉందని ఇజ్రాయెల్ అధికార వర్గాలు వెల్లడించాయి. టెల్ అవీవ్లోని భారత ఎంబసీ అధికారులు ఆస్పత్రికి చేరుకుని బాధితుడిని పరామర్శించారు.
సౌదీలో భారతీయుడు మరణించలేదు..
సౌదీ అరేబియాలో ఆర్మీ ప్రొజెక్టైల్ పడిపోయిన ఘటనలో ఓ భారతీయుడు మరణించినట్లు వచ్చిన వార్తలపై అక్కడి భారత ఎంబసీ స్పందించింది. దానిపై పూర్తి విచారణ జరిపిన అనంతరం అవన్నీ ఊహాగానాలేనని ప్రకటించింది. ఈ ఘటనలో భారతీయులెవరూ చనిపోలేదని వెల్లడించింది. అల్ఖర్జ్లోని నివాస ప్రాంతాల్లో ప్రొజెక్టైల్ కుప్పకూలింది.