Reading Time: < 1 minute

మన తెలంగాణ/హైదరాబాద్: పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో జరిగిన ’అంతర్జాతీయ సంతాల్ సదస్సు’ నిర్వహణ తీరు, అక్కడ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎదురైన పరిణామాలపై ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ద్రౌపది ముర్ము, అక్కడి పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధాకరమని, అవి తనను తీవ్ర ఆందోళనకు గురి చేశాయని పవన్ పేర్కొన్నారు.

గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా సంతాల్ సామాజిక వర్గం ఒక సదస్సును నిర్వహించినప్పుడు, అందులో ఆ వర్గానికి దక్కాల్సిన గౌరవం, ప్రాధాన్యత కచ్చితంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఎవరి కోసమైతే ఈ సదస్సును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారో, ఆ సంతాల్ కమ్యూనిటీకి చెందిన సభ్యులే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇబ్బందులు పడే పరిస్థితి తలెత్తడం అత్యంత విచారకరమని ఆయన అన్నారు. ఇలాంటి సాంస్కృతిక సమావేశాలు అందరినీ కలుపుకుపోయేలా, సున్నితత్వంతో కూడిన పరిపాలనా ప్రణాళికతో జరగాలని హితవు పలికారు.

భారత రాష్ట్రపతి పదవి అనేది దేశంలోనే అత్యున్నత రాజ్యాంగ పదవి అని, ఆ పదవికి, ఆ వ్యవస్థకు ఎల్లప్పుడూ అత్యున్నత గౌరవం దక్కాలని గుర్తు చేశారు. రాష్ట్రపతి పర్యటన అంటే ఎంతో హుందాగా, పకడ్బందీగా జరగాలని, అది ఆయా రాష్ట్రాల అధికార యంత్రాంగం బాధ్యత అని స్పష్టం చేశారు. రాష్ట్రపతి పర్యటనలో ప్రొటోకాల్, మర్యాదలకు భంగం వాటిల్లడం సరికాదన్నారు.

భారతదేశ అస్తిత్వంలో, మన దేశ ఖ్యాతిలో గిరిజన సమాజాలు అంతర్భాగమని పవన్ కల్యాణ్ కొనియాడారు. వారి సంస్కృతి, సంప్రదాయాలు, వారి గళానికి ఎల్లప్పుడూ నిజాయతీతో కూడిన గౌరవం లభించాలన్నారు. గిరిజనుల మనోభావాలను దెబ్బతీసేలా, రాజ్యాంగ అధిపతికి అసౌకర్యం కలిగించేలా జరిగిన ఈ సంఘటన దురదృష్టకరమని పవన్ కల్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగకుండా పాలకులు, అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు.