Reading Time: < 1 minute

సీఎం విజయ్‌తో నడిగర్ సంఘం ప్రతినిధుల కీలక భేటీ.. సినీ పరిశ్రమలో సమస్యలపై హామీ!

Caption of Image.

కోలీవుడ్ బాక్సాఫీస్‌ను తన మేనియాతో ఊపేసిన ‘దళపతి’ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. సరికొత్త రాజకీయ శకానికి తెరతీస్తూ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన సి. జోసెఫ్ విజయ్‌ను ఈరోజు (మే 15న) నడిగర్ సంఘం ప్రతినిధులు సెక్రటేరియట్‌లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సంఘం అధ్యక్షుడు, సీనియర్ యాక్టర్ నాసర్ నాయకత్వంలో హీరో కార్తీ, పూచి మురుగన్, కరుణాస్ తదితరులు సీఎం విజయ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

విజయ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు 

ఈ క్రేజీ మీటింగ్‌లో నడిగర్ సంఘం ప్రతినిధులు సీఎం విజయ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శాంతిభద్రతల కారణాల వల్ల గత కొన్నేళ్లుగా తమిళనాడులో నిలిచిపోయిన ‘ఎర్లీ మార్నింగ్ షోస్’ (ఉదయం 9 గంటల ఆటలు) పునఃప్రారంభానికి సీఎం విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  దీంతో సినీ పరిశ్రమ కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం కావడంతో, ఆయన తీసుకున్న ఈ స్పెషల్ డెసిషన్ పట్ల అటు ఇండస్ట్రీ వర్గాలు, ఇటు అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

సినీ కష్టాలపై చర్చ.. 

అంతే కాకుండా, కోలీవుడ్‌లో కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పలు కీలక సమస్యలను నాసర్, కార్తీ బృందం సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ముఖ్యంగా, గతంలో నిలిచిపోయిన రాష్ట్ర ప్రభుత్వ సినీ అవార్డులను (State Film Awards) ప్రతి ఏటా క్రమం తప్పకుండా నిర్వహించాలని వారు కోరారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సీఎం విజయ్ సానుకూలంగా స్పందిస్తూ.. తమ సొంత గూడైన సినీ పరిశ్రమ అభివృద్ధికి, కళాకారుల సంక్షేమానికి ప్రభుత్వం తరపున తప్పక తోడ్పాటు అందిస్తానని హామీ ఇచ్చారు. తమలో ఒకడు రాష్ట్రానికి లీడర్ అవ్వడంపై చిత్ర పరిశ్రమకు గర్వంగా ఉందంటూ నడిగర్ సంఘం హర్షం వ్యక్తం చేసింది. 

 

©️ VIL Media Pvt Ltd.