
ఇప్పటివరకు విడివిడిగా, వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న మంత్రిత్వ శాఖకు చెందిన 46 విభాగాలను ఇకపై ఒకే చోటికి తీసుకురానున్నారు. దీనివల్ల వివిధ కార్యాలయాల నిర్వహణ కోసం అవుతున్న కోట్లాది రూపాయల అదనపు భారం తగ్గడమే కాకుండా, ప్రభుత్వ ఖర్చులు భారీగా కలిసివస్తాయని మంత్రి స్పష్టం చేశారు. శాఖల మధ్య సమన్వయం పెరిగి, వ్యాపార అనుమతులు మరింత వేగంగా లభిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ, దేశంలోని సామాన్య ప్రజలపై ఆ భారం పడకుండా మోదీ ప్రభుత్వం రక్షించిందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. అంతర్జాతీయ సంక్షోభం ఉన్నప్పటికీ భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలను కేవలం 3 రూపాయలు మాత్రమే పెంచి, మిగిలిన భారీ భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించిందన్నారు. అంతర్జాతీయంగా ఎరువుల ధరలు పెరిగినా దేశంలో పెంచకుండా రైతులకు అండగా నిలిచామన్నారు. ప్రధాని మోదీ ఇటీవల జరిపిన యూఏఈ పర్యటనతో దేశంలో ఇంధన సరఫరా మరింత సులభతరం కానుందని, దీనివల్ల రాబోయే రోజుల్లో ఇంధన సంక్షోభం పూర్తిగా తొలగిపోతుందని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందుల వల్ల పలు దేశాల ఎగుమతులు క్షీణిస్తున్నప్పటికీ, భారత్ మాత్రం ఎగుమతుల రంగంలో దూసుకుపోతోందని కేంద్రమంత్రి అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని విపక్షాలు తక్కువ చేసి చూపిస్తున్నాయని మండిపడ్డారు. వాస్తవాలు తెలుసుకోకుండా ప్రతిపక్షాలు కేవలం రాజకీయం కోసమే విమర్శలు చేస్తున్నాయన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం తరహాలోనే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా విమాన ఇంధనం పై విధిస్తున్న వ్యాట్ ను తగ్గించి, ప్రజలకు ఊరటనిస్తాయా? అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోదీ సమర్థవంతమైన పాలనలోనే దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత సుస్థిరంగా ఉందన్నారు.
ఇదిలా ఉండగా భారత్, అమెరికా దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా చర్చలు సాగుతున్నాయన్నారు. ఇప్పటికే ఇరుదేశాల మధ్య ఉన్న కొన్ని కీలక షరతులపై స్పష్టత వచ్చిందని పేర్కొన్నారు. అమెరికా విధించిన సెక్షన్ 301 విచారణకు త్వరలోనే ఉభయపక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించనుందని ఆయన తెలిపారు. ఈ ఒప్పందం ఒకే అమెరికా మార్కెట్లో భారతీయ ఉత్పత్తులకు ప్రత్యేక ప్రాధాన్యత లభిస్తుందని, ఫలితంగా దేశీయ ఎగుమతులు, దిగుమతుల రంగంలో సరికొత్త ఉపాధి, వ్యాపార అవకాశాలకు లభిస్తాయన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.