
- భర్త మరణం తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించిన భార్య
- కామారెడ్డి జిల్లా లింగంపేటలో ఘటన
లింగంపేట, వెలుగు: నాటు తుపాకీతో కాల్చుకొని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మోతె గ్రామంలో గురువారం జరిగింది. స్థానిక ఎస్సై దీపక్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తిలిపితియా ఇంద్రజిత్ సింగ్ (30) వెల్డింగ్ పనిచేస్తుంటాడు.
మద్యం అలవాటు ఉన్న ఇంద్రజిత్ సింగ్ అప్పుడప్పుడు కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో గురువారం కుటుంబసభ్యులందరినీ ఇంట్లోంచి బయటకు పంపి.. నాటు తుపాకితో ఛాతిపై కాల్చుకున్నాడు. దీంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు.
భర్త మరణాన్ని తట్టుకోలేకపోయిన అతడి భార్య సనమ్కోర్ గ్రామ సమీపంలోని కుంటలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన స్థానికులు ఆమెను రక్షించారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించారు. నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నామని, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని ఎస్సై చెప్పారు. మృతుడి తల్లి అమృత్కౌర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.