Reading Time: 2 minutes
Nestle India Q4 Results Profit Surge Dividend Record Date 2026

Nestle India: ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం నెస్ట్లే ఇండియా 2025-26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో అదిరిపోయే ఫలితాలను నమోదు చేసింది. మార్చి 2026తో ముగిసిన ఈ త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం ఏకంగా 27 శాతం వృద్ధి చెంది రూ. 1,111 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే సమయంలో ఈ లాభం రూ. 873 కోట్లుగా ఉండగా, ఈ ఏడాది మార్కెట్ నిపుణులు అంచనా వేసిన రూ. 926 కోట్లను నెస్టలే భారీ తేడాతో క్రాస్ చేసింది. కేవలం లాభాల్లోనే కాకుండా ఆదాయంలోనూ కంపెనీ 23 శాతం వృద్ధిని సాధించి రూ. 6,748 కోట్ల మార్కును అందుకుంది. ముఖ్యంగా మ్యాగీ, కిట్‌క్యాట్ వంటి బ్రాండ్ల పట్ల వినియోగదారులు చూపిస్తున్న ఆదరణతో దేశీయ అమ్మకాలు మునుపెన్నడూ లేని విధంగా రూ.6,445 కోట్ల రికార్డు స్థాయికి చేరుకున్నాయి.

READ ALSO: History: పూర్వం ఏసీలు, కూలర్లు లేవు కదా? మరి అంత ఎండలో రాజులు, చక్రవర్తులు ఎలా బ్రతికారు?

ఈ మెరుగైన ప్రదర్శనకు ప్రధాన కారణం కంపెనీ అనుసరించిన మార్కెటింగ్ వ్యూహాలేనని నెస్ట్లే ఇండియా సీఎండీ మనీష్ తివారీ పేర్కొన్నారు. ఈ త్రైమాసికంలో ప్రకటనల కోసం చేసే ఖర్చును కంపెనీ 50 శాతానికి పైగా పెంచినప్పటికీ, సమర్థవంతమైన నిర్వహణ వల్ల ఎబిటా (EBITDA) మార్జిన్లను 26.3 శాతంగా స్థిరంగా ఉంచుకోగలిగింది. అద్భుతమైన వృద్ధిని సాధించిన తరుణంలో వాటాదారులకు కూడా కంపెనీ తీపి కబురు అందించింది. ప్రతి షేరుకు రూ.5 చొప్పున ఫైనల్ డివిడెండ్‌ను బోర్డు సిఫార్సు చేయగా, దీని కోసం జూలై 10వ తేదీని రికార్డ్ డేట్‌గా నిర్ణయించింది.

నెస్ట్లే ప్రకటించిన ఈ బంపర్ ఫలితాలతో స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టర్లు ఎగబడి షేర్లను కొనుగోలు చేశారు. ఫలితంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో కంపెనీ షేరు విలువ 7 శాతం మేర పెరిగి రూ.1,379.90 వద్ద కొత్త 52 వారాల గరిష్ట స్థాయిని తాకింది. స్టాండ్‌లోన్ ప్రాతిపదికన కూడా కంపెనీ లాభం 26 శాతం పెరిగి రూ.1,114 కోట్లుగా నమోదవ్వడం విశేషం. మొత్తం మీద పెరుగుతున్న ముడి సరుకుల ధరల సవాళ్లను అధిగమిస్తూ, భారీ ప్రకటనల ఖర్చు చేసినా లాభదాయకతను కాపాడుకోవడంలో నెస్ట్లే విజయం సాధించింది.

READ ALSO: SRH vs DC: ఉప్పల్‌లో ‘ఆరెంజ్’ ఆర్మీ వర్సెస్ ‘ఢిల్లీ’ వార్ షురూ.. టాస్ ఎవరు గెలిచారంటే!