Reading Time: < 1 minute
Ap Cm Chandrababu Naidu Backs Modi For Southern States Development In Chennai

CM Chandrababu: తమిళనాడులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తు్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నైలో మీడియా సమావేశం నిర్వహించారు.. కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌తో కలిసి జరిగిన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి కోసం తాను మాట్లాడుతున్నానని, అందుకే జాతీయ ప్రయోజనాల కోసం పని చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి పూర్తి మద్దతు ఇస్తున్నామని తెలిపారు. ఘనమైన చరిత్ర, వారసత్వం, సంపద కలిగిన రాష్ట్రం అని కొనియాడారు. తమిళ ప్రజలకు తమ భాషపై అపారమైన ప్రేమ ఉందని, కష్టించి పనిచేసే స్వభావం వారిదని అన్నారు. తమిళనాడు నుంచి ఎంతో మంది ఉన్నతాధికారులు, ప్రముఖులు దేశానికి సేవ చేశారని గుర్తుచేశారు.

Read Also: Cool Water Without Fridge: ఫ్రిడ్జ్ అవసరం లేదు.. ఈ ఒక్క గోనె సంచి చిట్కాతో కూల్‌ కూల్‌ వాటర్‌ తాగొచ్చు..

ఇక, ఎన్టీఆర్‌ ప్రారంభించిన తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా చెన్నైకు తాగునీరు అందిందని చంద్రబాబు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు ప్రజల మధ్య అన్నదమ్ముల బంధం ఉందని పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన అంశంపై మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న సీట్లపై 50 శాతం పెంపుతో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం మంచి ఫార్ములా అని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్‌, డీఎంకే తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు.. రాహుల్‌ గాంధీ, స్టాలిన్‌ వంటి నేతలు బిల్లులను అడ్డుకోవడం ద్వారా మహిళలకు అన్యాయం చేశారని చంద్రబాబు ఆరోపించారు.

తమిళనాడులో అభివృద్ధి మందగించిందని, చెన్నై వంటి నగరాల నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు పెరుగుతున్నాయని అన్నారు చంద్రబాబు… రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు, మహిళలపై నేరాలు, కస్టోడియల్ మరణాలు, డ్రగ్స్ సమస్యలు పెరిగాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చెన్నై రైల్వే స్టేషన్ ఆధునీకరణకు పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చిందని తెలిపారు. త్వరలో చెన్నై-బెంగళూరు-అమరావతి నగరాలను అనుసంధానించే హైస్పీడ్ రైలు కారిడార్‌కు కేంద్రం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి కీలకమవుతుందని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు..