July 10, 2026

Off The Record: వాసుపల్లి వ్యవహారం వైసీపీ నాయకత్వానికి తలపోటైందా?

Off The Record: వాసుపల్లి వ్యవహారం వైసీపీ నాయకత్వానికి తలపోటైందా?
Reading Time: 2 minutes
Off The Record About Vasupalli Ganesh Kumar Controversy Internal Tensions Rise In Ysr Congress Party Over Visakhapatnam South Politics

Off The Record: వాసుపల్లి గణేష్ కుమార్….విశాఖ దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే. పీఆర్పీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి…..టీడీపీలో రెండు సార్లు గెలిచి…వైసీపీ అధికారంలోకి రాగానే ప్లేట్ ఫిరాయించిన నేత. 2014, 2019 ఎన్నికల్లో తాను ఓడించిన ఫ్యాన్ పార్టీ కేడర్‌కే ఇప్పుడు నాయకత్వం వహిస్తూ కూటమితో ఢీ అంటే ఢీ అంటున్నారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతటా జగన్‌ హవా ఉన్నా…. వాసుపల్లి మాత్రం సౌత్ అడ్డాలో సత్తా చాటగలిగారు. ఆయనకున్న మాస్ ఇమేజ్ అప్పుడు బాగా కలిసివచ్చిందని అంటారు. ఇక అప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చాక నాటి టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు చుట్టూ అనేక ఊహాగానాలు నడిచాయి. ఇవాళో, రేపో జెండా పీకేస్తారని ప్రచారం జరిగినోళ్లంతా సైలెంట్ అయిపోగా… అనూహ్యంగా టీడీపీకి ఝలక్ ఇచ్చి సంచలనం సృష్టించారు గణేష్ కుమార్. అలా పార్టీ మారడం వెనక గణేష్ ఆలోచనలు ఏమైనప్పటికీ.. మంత్రి పదవి ఆఫర్ ఉందని.. అందుకే ఫిరాయించారంటూ విస్తృత ప్రచారం జరిగింది. అలాంటిదేం జరక్కున్నా.. పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి దృష్టిని ఆకర్షించడంలో మాత్రం వాసుపల్లి సక్సెస్ అయ్యారట.

అదంతా ఒక ఎత్తయితే… ఇప్పుడు వాసుపల్లి వ్యవహారం పార్టీ నాయకత్వానికి తలపోటుగా మారిందని చెప్పుకుంటున్నారు. నాడు ఎమ్మెల్యే హోదాలో వైసీపీ కండువా కప్పుకున్న వెంటనే రీజనల్ కో ఆర్డినేటర్ వ్యవస్థ మీద గళం ఎత్తారాయన. అప్పట్లో పార్టీలో కీలకంగా ఉన్న విజయసాయిరెడ్డి నాయకత్వాన్ని ప్రశ్నించడం రాజకీయ సంచలనం. ఇక రీజనల్ కో ఆర్డినేటర్‌గా సుబ్బారెడ్డి వచ్చిన తర్వాత కొంత మేర తగ్గినట్టు కనిపించారు వాసుపల్లి. ఇక రాష్ట్రంలో పార్టీ ఓటమి తర్వాత కొద్ది రోజులు సైలెంట్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే….ఇటీవల ఇంటా బయట రచ్చ చేస్తున్నారట. ఆయన చేస్తున్న హంగామా కేడర్‌లో తీవ్ర చర్చనీయాంశం అవుతుండగా… సీనియర్స్‌లో వ్యతిరేకతను పెంచుతోందట. దక్షిణ నియోజకవర్గ పరిశీలకుడిగా మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్యను నియమించింది పార్టీ. నియోజకవర్గంలో ఇన్చార్జ్‌, క్యాడర్ మధ్య సమన్వయం., పార్టీ కార్యకలాపాలను విస్తరించానికి సహకరించడం పరిశీలకుడి డ్యూటీ. అయితే…. సౌత్ లో నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు వ్యవహరిస్తున్న గణేష్ కుమార్…. పరిశీలకుడికి నో ఎంట్రీ బోర్డు పెట్టేసారన్న ప్రచారం జరుగుతోంది. అటు గణేష్‌కు అధినాయకుడు దగ్గర అన్న
గుర్తింపును దృష్టిలో ఉంచుకుని వెంకట రామయ్య సైతం టచ్ మీ నాట్‌ అన్నట్టు ఉంటున్నారట. ఒక్క పరిశీలకుడితోనే కాదు, ఇటీవలి కాలంలో మిగిలిన నాయకులతోనూ గణేష్ కుమార్ వైఖరి దూకుడుగానే ఉందన్న గుసగుసలు ఎక్కువయ్యాయి. మాజీ ఎమ్మెల్యే తీరుతో విసిగిపోయిన ముఖ్య నాయకులు సైతం హలో అంటే హలో అని సరి పెట్టేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం వాసుపల్లి అపరిచితుడుగా మారిపోయారా…?. బాస్ దగ్గర గుడ్ లుక్స్ చూసుకుని లోకల్‌ నేతలపై ధిక్కార ధోరణి ప్రదర్శిస్తున్నారా..!. అనే  చర్చ జరుగుతోంది. అలాగని, ఎక్స్ ఎమ్మెల్యే మీద ఫిర్యాదులు చేసినా… ఇప్పటికిప్పుడు పార్టీ అధినాయకత్వం ప్లస్ లు మైనస్ లు లెక్కేసుకుని సర్దుబాట్లు చేసే పరిస్థితి కూడా లేదని వైసీపీ వర్గాలే చెప్పుకుంటున్నాయి.

ఈ క్రమంలో గణేష్ కుమార్ కొద్దిరోజులుగా పార్టీ ముఖ్యనాయకత్వాన్ని బహిరంగ వేదికలపై ప్రశ్నించడం కొత్త చర్చకు కారణం అవుతోంది. రీజనల్ కోఆర్డినేటర్‌గా కన్నబాబు నియామకాన్ని సైతం వాసుపల్లి అంగీకరించలేకపోతున్నారట. విశాఖలో నాయకులే లేనట్టు పొరుగు జిల్లాలలను తెచ్చి మానెత్తిన పెట్టాల్సిన అవసరం ఏముందనేది ఆయన ప్రశ్న. దీంతో పార్టీ వేదికల మీద తప్ప లోకల్‌ వైసీపీ నాయకత్వం వాసుపల్లితో కలిసి మెలిసి ఉన్న సందర్భాలు అరుదే. ప్రశ్నిస్తే పోయేదేమనుకుంటున్నారో….. లేక రాజకీయ ఎత్తుగడగా చూస్తున్నారోగానీ… కొంతకాలంగా గణేష్ కుమార్ వ్యవహరిస్తున్న తీరుతో సొంత పార్టీలోనే వ్యతిరేకత పెరుగుతోందని అంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆయన పోస్ట్ చేసిన మిడ్ నైట్ మెసేజ్ గరం గరం చర్చకు తెరలేపింది. పొరుగు నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియా గ్రూపులో వాసుపల్లి పెట్టిన పోస్టింగ్ సెకండ్ల వ్యవధిలోనే చేరాల్సిన చోటకు స్క్రీన్ షాట్ రూపంలో చేరిపోయిందట. ఆ మెసేజ్ లో ఉన్న సమాచారం చూసి అలర్ట్ అయిన ముఖ్య నాయకులు మాజీ ఎమ్మెల్యేకి ఫోన్ చేసి తొలగించాలని కోరినట్లు తెలిసింది. ఆయన కూడా సానుకూలంగానే స్పందించి సోషల్ మీడియా నుంచి తీసేసినా…. అప్పటికే అంటుకున్న అగ్గి మాత్రం ఆరడం లేదు. పార్టీ అధ్యక్షుడు నియమించిన నేతలను బైపాస్ చేయడం, అసంతృప్తిని బహిర్గతం చేయడం కరెక్ట్‌ కాదంటూ పార్టీ ముఖ్య నాయకులు వాసుపల్లితో గట్టిగానే వాదించినట్టు తెలిసింది. ఇక రీజినల్‌ కో ఆర్జినేటర్స్‌గా బయటి వాళ్ళు వద్దన్నదే వాసుపల్లి అభ్యంతరం అయితే….. గతంలో టిడిపి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు, సిటీ పార్టీ అధ్యక్షుడుగా పనిచేసినప్పుడు ఏం చేశారంటూ ప్రశ్నిస్తున్నారు కొందరు. గణేష్‌కుమార్ గతాన్ని మర్చిపోయారా…? లేక అమ్మ పుట్టింటి సంగతులు మేనమామకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారా అంటూ సెటైర్స్‌ కూడా వేస్తున్నారు విశాఖ సౌత్‌ వైసీపీ నాయకులు.