
మనతెలంగాణ/హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ మహిళాలోకానికి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు సామాజిక సంపద సృష్టికర్తలు అని, దేశాభివృద్ధిలో పురుషుడితో సమానంగా స్త్రీ భాగస్వామ్యం ఇమిడివున్నదని అన్నారు. సంతానోత్పత్తి అనే అనివార్యమైన ధర్మాన్ని పాటించాల్సిన బాధ్యత స్త్రీకి ప్రకృతి కేటాయించిందని, మానవ మనుగడను కొనసాగించే ప్రత్యేక కర్తవ్యాన్ని అనేక కష్టాలతో నిర్వర్తిస్తున్న మహిళ త్యాగశీలి అని కెసిఆర్ కొనియాడారు.
ఆకాశంలో సగమై, అపారమైన శక్తి సామర్థ్యాలు కలిగివున్న మహిళా లోకానికి అన్ని రంగాల్లో పురుషునితో సమానమైన అవకాశాలను మరింతగా అందించినపుడు మాత్రమే, కుటుంబాభివృద్ధి సంపూర్ణ మవుతుందని, తద్వారా సమాజ, దేశ, ప్రపంచాభివృద్ధి ఫరిడవిల్లుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో,అనంతర స్వయంపాలనలో తెలంగాణ మహిళల పాత్ర గొప్పదని వివరించారు.
మహిళా సాధికారత దిశగా, వారి సంక్షేమం, ప్రగతికోసం పదేండ్ల బిఆర్ఎస్ పాలనలో అమలు చేసిన పలు కార్యక్రమాలను ఈ సందర్భంగా కెసిఆర్ స్మరించుకున్నారు. మహిళా సాధికారతను మరింతగా పెంచే దిశగా ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరమున్నదని కెసిఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.