Reading Time: < 1 minute

ఖమేనీ కొడుకే ఇరాన్ కొత్త సుప్రీం లీడర్.. మోజ్తబా ఖమేనీ బ్యాగ్రౌండ్ ఇదే !

Caption of Image.

టెహ్రాన్: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కొడుకు మోజ్తబా ఖమేనీని ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఆ దేశం నియమించింది. ఈ నియామకంతో ఖమేనీ రాజకీయ వారసత్వంపై ఆయన మరణానంతరం కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో అయతుల్లా అలీ ఖమేనీ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అసెంబ్లీ నిపుణుల కమిటీ అలీ ఖమేనీ కుమారుడు మోజ్తాబాను ఇరాన్ కొత్త సుప్రీం నాయకుడిగా ఎన్నుకుంది.

ఇరాన్ అంతర్జాతీయ వర్గాలు ఈ నియామకాన్ని ధృవీకరించాయి. ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఒత్తిడితో మోజ్తాబా ఎన్నికవడం గమనార్హం. 1989 నుంచి ఇరాన్‌ను పాలించిన అయతుల్లా అలీ ఖమేనీ, మధ్యప్రాచ్యంలో ఎక్కువ కాలం పనిచేసిన దేశాధినేతగా రికార్డ్ సృష్టించారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు ఆయన ఇరాన్ను పాలించారు. 

యుద్ధం లాంటి కీలక నిర్ణయాలతో సహా అన్ని నిర్ణయాల్లో ఇరాన్ సుప్రీం నాయకుడే కీలకంగా వ్యవహరిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇరాన్ ప్రతీ నిర్ణయం సుప్రీం లీడర్ కనుసన్నల్లోనే ఉంటుంది. ఇరాన్లో సుప్రీం నాయకుడిదే అంతిమ అధికారం. 

ఇక.. మోజ్తాబా ఖమేనీ ఎవరనే విషయానికొస్తే.. దివంగత ఖమేనీ పెద్ద కుమారుడే ఈ 56 ఏళ్ల మోజ్తాబా ఖమేనీ. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. షియా మతాధికారి. అయినప్పటికీ గతంలో ఎప్పుడూ మోజ్తాబా అధికారిక ప్రభుత్వ పదవిని నిర్వహించలేదు. 

తండ్రి మరణంతో ఇరాన్ సుప్రీం లీడర్ గా బాధ్యతలు చేపట్టడటం ఆయనకు అనివార్యమైంది. అయితే.. ఇప్పటివరకూ నేరుగా పాలనలో వ్యవహారాల్లో భాగం కాకపోయినప్పటికీ తెరవెనుక ప్రభావవంతమైన పాత్ర పోషించారని ఇరాన్ రాజకీయ వర్గాలు చెప్పుకొచ్చాయి.

©️ VIL Media Pvt Ltd.