
ముంబై: న్యూజిలాండ్తో సొంత గడ్డపై జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం టీమిండియాను త్వరలో ఎంపిక చేయనున్నారు. అయితే భారత జట్టులో ఎవరికి చోటు దక్కుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్టార్ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్లకు టీమిండియాలో చోటు ఖాయంగా కనిపిస్తోంది. శ్రేయస్ గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్నెస్ సాధించాడు. దీంతో అతనిఎంపిక దాదాపు ఖరారైందనే చెప్పాలి. శుభ్మన్ గిల్ కెప్టెన్గా, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్గా ఎంపిక కావడం లాంఛనమే.
అయితే ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య సిరీస్లో చోటు దక్కించుకోవడం కష్టంగా కనిపిస్తోంది. పూర్తి ఫిట్నెస్ సాధించక పోవడమే దీనికి కారణం. ఇక సౌతాఫ్రికా సిరీస్లో నిరాశ పరిచిన వాషింగ్టన్ సుందర్కు ఉద్వాసన ఖాయమనే చెప్పొచ్చు. తెలుగు కుర్రాడు తిలక్వర్మకు కూడా చోటు కష్టంగానే మారింది. స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ కూడా జట్టులో చోటు సంపాదించడం అసాధ్యమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్లకు చోటు ఖరారైనట్టు తెలిసింది.