
శ్రీలంక వేదికగా జరిగిన ముక్కోణపు సిరీస్ ఫైనల్లో శ్రీలంక ఎ జట్టుపై భారత్ ఎ జట్టు 66 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ భారీ విజయంపై టీమిండియా ఎ జట్టు కెప్టెన్ తిలక్ వర్మ మ్యాచ్ అనంతరం మాట్లాడారు. టోర్నీ లీగ్ దశలో వరుస ఓటములను ఎదుర్కొని, ఆపై ఫైనల్లో జట్టు చూపిన తెగువ, ఆటతీరు అద్భుతమని ప్రశంసించారు.
నిజమైన క్యారెక్టర్ చూపించారు
“ఈ టోర్నమెంట్లో ప్రతి ఒక్కరూ తమ నిజమైన క్యారెక్టర్ను చూపించారు. ముఖ్యంగా లీగ్ దశలో ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక జట్ల చేతుల్లో బ్యాక్-టు-బ్యాక్ మ్యాచ్ల్లో ఓడిపోయినప్పుడు జట్టుపై తీవ్ర ఒత్తిడి ఉంది. కానీ అక్కడి నుంచి కోలుకుని, భారీ రన్ రేట్ మార్జిన్తో మ్యాచ్లు గెలుస్తూ మైదానంలో ఆటగాళ్లు చూపిన వైఖరి నిజంగా అద్భుతం” అని తిలక్ వర్మ పేర్కొన్నారు. జట్టు విజయ రహస్యం గురించి చెబుతూ, “మా జట్టులోని ఆటగాళ్లందరికీ తమ తమ రాష్ట్రాల తరఫున డొమెస్టిక్ మ్యాచ్లు ఆడిన మంచి అనుభవం ఉంది. మ్యాచ్కు ముందు సరైన ప్రణాళికలు రచించుకుని, మైదానంలో వాటిని అమలు చేయడం వల్లే ఇది సాధ్యమైంది” అని వెల్లడించారు.

సూర్యవంశీ, ఆర్య ఓపెనింగ్ అద్భుతం..
పవర్ప్లేలో జట్టు వ్యూహాల గురించి వివరిస్తూ.. “మేము పవర్ప్లేలో (1 నుండి 10 ఓవర్లు), అలాగే 10 నుండి 40 ఓవర్ల మధ్య ఇన్నింగ్స్ను ఎలా నిర్మించాలో ముందే ప్లాన్ చేసుకున్నాం. ఆ తర్వాత ఇన్నింగ్స్ చివర్లో స్కోరు వేగాన్ని పెంచాం. డెత్ ఓవర్లలో మాకు మంచి హిట్టర్లు ఉన్నారనే నమ్మకం మాకుంది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ, ప్రియాంశ్ ఆర్య మ్యాచ్ను ఓపెనింగ్ చేసిన విధానం చాలా బాగుంది. వారిచ్చిన బలమైన పునాదితో మిడిల్ ఓవర్లలో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పగలిగాం” అని కెప్టెన్ ప్రశంసించారు.

బౌలింగ్లో నేర్చుకోవాల్సింది చాలా ఉంది..
ఈ టోర్నీ ద్వారా జట్టుగా ఏం నేర్చుకున్నారనే ప్రశ్నకు తిలక్ స్పందిస్తూ.. “నిజం చెప్పాలంటే మా బ్యాటింగ్ ప్రదర్శన అనుకున్న స్థాయిలోనే ఉంది. కానీ బౌలింగ్ విభాగం కొద్దిగా నిరాశపరిచింది. మా వద్ద అత్యుత్తమ బౌలింగ్ అటాక్ ఉంది, కానీ ఇలాంటి వన్-ఆఫ్ సిరీస్లలో కొన్నిసార్లు లయ తప్పడం సహజం. టోర్నీ ముగిసే సమయానికి ఫలితం మనకు అనుకూలంగా రావడం ముఖ్యం. మేము గెలిచిన పక్షంలో ఉన్నాం కాబట్టి సంతోషంగా ఉంది, కానీ అదే సమయంలో బౌలింగ్ విభాగంలో మేము నేర్చుకోవాల్సింది, సరిదిద్దుకోవాల్సింది చాలా ఉంది” అని నిజాయితీగా అంగీకరించారు.