Reading Time: 2 minutes
Junagadh Rare Coin And Currency Notes Exhibition Heritage

జునాగఢ్‌లో నిర్వహించిన ఒక ప్రత్యేక నాణేలు, నోట్ల ప్రదర్శన (ఎగ్జిబిషన్) భారతీయ కరెన్సీ సుసంపన్నమైన, చారిత్రాత్మక వారసత్వాన్ని ప్రజల కళ్లముందుకు తీసుకువచ్చింది. జయశ్రీ టాకీస్ రోడ్ సమీపంలోని సర్దార్ పటేల్ కమ్యూనిటీ హాల్‌లో ఇటీవల జరిగిన ఈ ప్రదర్శనలో పాత, కొత్త నోట్లతో పాటు వివిధ రకాల నాణేలను ప్రదర్శించారు. కేవలం భారతీయ కరెన్సీ మాత్రమే కాకుండా, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చలామణిలో లేని పాత విదేశీ కరెన్సీలను కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచడం విశేషం.

ఈ ఎగ్జిబిషన్ సందర్శకులకు కేవలం చూసేందుకే కాకుండా, అరుదైన నాణేలు మరియు నోట్లను కొనుగోలు చేయడానికి లేదా విక్రయించడానికి ఒక మంచి అవకాశాన్ని కల్పించింది. ఈ క్రమంలోనే ప్రదర్శనలో ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ముర్తజాభాయ్ అనే ఎగ్జిబిటర్ ప్రదర్శించిన ఒక్క రూపాయి నోట్లను చూసి ఒక సందర్శకుడు ముగ్ధుడై, వాటిని రూ. 1,250 లకు కొనుగోలు చేస్తానని ప్రతిపాదించాడు. అయితే.. ముర్తజాభాయ్ వాటిని విక్రయించడానికి నిరాకరించాడు. తన తండ్రి, తాతల కాలం నాటి అరుదైన నాణేలు, నోట్ల సేకరణ తన వద్ద ఉందని.. ముఖ్యంగా ఆ రూపాయి నోట్లపై 1 నుండి 100 వరకు వరుస క్రమంలో (సీరియల్ నంబర్లు) ఉండటం వల్ల నాణేల సేకర్తలకు (న్యూమిస్మాటిస్ట్స్) అవి ఎంతో విలువైనవని ఆయన పేర్కొన్నాడు.

ముంబై నుండి వచ్చిన మరో ఎగ్జిబిటర్ నిఖిల్ పరేఖ్ స్టాల్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆయన వద్ద 10 రూపాయల నోట్ల భారీ కలెక్షన్ ఉంది. ఎవరైనా తమ పుట్టినరోజు చెబితే, ఆ తేదీని పోలిన సీరియల్ నంబర్ ఉన్న 10 రూపాయల నోటును ఆయన వారికి అందిస్తారు. ఇటీవలే ముద్రించిన కొత్త 10 రూపాయల నోట్ల కలెక్షన్ కూడా ఆయన వద్ద భారీగా ఉంది. జునాగఢ్ ఎగ్జిబిషన్‌లో పాల్గొనడం తనకు ఇదే తొలిసారి అని పరేఖ్ తెలిపారు. చాలా మంది సందర్శకులు తమకు గుర్తిండిపోయే ప్రత్యేకమైన తేదీలు ఉన్న నోట్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించారు.

మరొక స్టాల్ యజమాని అశ్విన్‌భాయ్, ఒక సందర్శకుడి నుండి రూ. 60,000 చెల్లించి 100 ఏళ్ల నాటి ఆరు వెండి నాణేలను కొనుగోలు చేశారు. రాజులు, రాణుల చిత్రాలు ఉన్న ఈ నాణేలు స్వచ్ఛమైన వెండితో తయారు చేయబడ్డాయి. వీటికి చారిత్రక ప్రాధాన్యత ఎంతో ఉంది. ఈ ప్రదర్శన చరిత్రపై ఆసక్తి ఉన్నవారికి, నాణేల సేకర్తలకు ఒక అద్భుతమైన వేదికగా నిలిచింది.