
దేశంలోనే బంగారానికి ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్గా మారనుంది. బంగారు గనిగా రాష్ట్రం మారనుంది. దీనికి కారణం ఏపీలో బంగారు నిల్వలు బయటపడటమే. కర్నూలు జిల్లా బంగారు నిల్వలను గుర్తించారు. దీంతో రాబోయే కొన్నేళ్లల్లో దేశంలో అతిపెద్ద బంగారు సరఫరాదారుగా ఏపీ మారనుంది. కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గ్రామంలో 50 టన్నుల బంగారు నిల్వలను కనుగొన్నారు. ప్రస్తుతానికి భారత్ బంగారాన్ని విదేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. ఈ బంగారు గనులు బయటపడటంతో రాబోయే రోజుల్లో దేశానికి అత్యధికంగా బంగారాన్ని సరఫరా చేసే రాష్ట్రంగా ఏపీ మారనుందని చెబుతున్నారు. ఇదే జరిగితే ఏపీ పేరు మారుమ్రోగిపోనుంది. ఇక బంగారు గనులను గుర్తించేందుకు మరిన్ని ప్రాంతాల్లో తవ్వకాలు ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు.
జొన్నగిరితో పాటు బంగారు గనులను గుర్తించేందుకు మరో నాలుగు ప్రాంతాలను అధికారులు గుర్తించారు. రామగిరి, జవ్వకుల, చిగురుకుంట-బిస్నాతం ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించారు.. ఖనిజ సంపద అధికంగా ఉన్న ఈ ప్రాంతాలను మరింతగా అన్వేషించి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. జొన్నగిరి బంగారు ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వ ప్రారంభించింది. స్వాతంత్ర్యం తర్వాత దేశంలోనే మొట్టమొదటి భారీ స్థాయి ప్రైవేట్ బంగారు తవ్వకం ప్రాజెక్టుగా ఇది నిలిచింది. జియోమైసోర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ ప్రాజెక్టును చేపట్టింది. రూ.400 కోట్లకు పైగా పెట్టుబడి దీనిని ప్రారంభించింది. 598 హెక్టార్లలో ఈ ఓపెన్ పిట్ గని విస్తరించి ఉండగా.. రాబోయే 15 ఏళ్లల్లో ఏటా వెయ్యి కిలోగ్రాముల వరకు శుద్ధి చేసిన బంగారాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
2000లో కర్ణాటకలోని కోలార్ బంగారు గనులను మూసివేశారు. ప్రస్తుతం కర్ణాటకలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన హుట్టి బంగారు గనులు దేశంలో ఏకైక ప్రధాన బంగారు ఉత్పత్తిదారుగా ఉన్నాయి. ఇక్కడ సంవత్సరానికి 1.5 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. కానీ దేశ అవసరాలకు ఇది సరిపోవడం లేదు. భారతదేశ బంగారు వినియోగం ప్రతి సంవత్సరం 800 టన్నులకు పైగా ఉంది. కానీ దేశంలో దానికి తగ్గట్లు ఉత్పత్తి లేకపోవడంతో విదేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. దేశంలో మరిన్ని బంగారు గనులు గురిస్తే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు.