
Shashi Tharoor: ప్రధాని నరేంద్రమోడీపై, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మరోసారి ప్రశంసలు కురిపించారు. మోడీ, ట్రంప్ మధ్య జరిగిన భేటీపై థరూర్ వ్యాఖ్యానించడం ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. మిడిల్ ఈస్ట్ సంక్షోభం నేపథ్యంలో, భారత నావికుల భద్రతా అంశాన్ని మోడీ ట్రంప్ దృష్టికి తీసుకెళ్లారని థరూర్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ కాంగ్రెస్ను టార్గెట్ చేసింది.
జీ7 సదస్సు సందర్భంగా ఫ్రాన్స్లో మోడీ-ట్రంప్ సమావేశం జరిగింది. గల్ఫ్ ప్రాంతంలో పనిచేస్తు్న్న భారత నావికుల భద్రతపై మోడీ ఆందోళన వ్యక్తం చేసినట్లు థరూర్ అన్నారు. యుద్ధ పరిస్థితుల్లో నావికులను టార్గెట్ చేయడం సరికాదని మోడీ స్పష్టం చేసినట్లు ఆయన చెప్పారు. ‘‘ నావికులు సైనికులు కారు. యుద్ధ సమయంలో వారిని లక్ష్యంగా చేసుకోవద్దని మోడీ ట్రంప్కు చెప్పారు’’ అని థరూర్ అన్నారు. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో అమెరికా దాడి వల్ల ముగ్గురు భారతీయ నావికులు మరణించారు. అయితే, ఈ ఘటనపై ప్రధాని మోడీ మౌనంగా ఉన్నారంటూ కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో థరూర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఈ వ్యాఖ్యల్ని బీజేపీ తనకు అనుకూలంగా వాడుకుంది. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ మాట్లాడుతూ.. థరూర్ వ్యాఖ్యలు రాహుల్ గాంధీ వైఖరిని బహిర్గతం చేశాయని అన్నారు. దేశ ప్రయోజనాల విషయంలో మోడీ ముందుంటారని, కానీ రాహుల్ గాంధీ మాత్రం ప్రభుత్వాన్ని విమర్శించడానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారని ఫైర్ అయ్యారు. దాదాపు 16 నెలల తర్వాత, ఫ్రాన్స్ జీ7 సదస్సు వేదికగా ట్రంప్, మోడీ భేటీ అయ్యారు. ఈ సమయంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం గురించి ప్రస్తావించారు. నావికుల భద్రతను ట్రంప్ ముందు మోడీ ప్రస్తావించారు.