Reading Time: 2 minutes

200 మ్యాచ్‌లు.. ప్రత్యేక జెర్సీ, క్యాప్‌తో హర్మన్‌ప్రీత్ కౌర్కి సన్మానం

Caption of Image.

Harmanpreet Kaur: మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న గ్రూప్-A కీలక మ్యాచ్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన మైలురాయిని అందుకుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్ హిస్టరీలోనే ఏకంగా 200 మ్యాచ్‌లు (200 T20Is) ఆడిన ప్రపంచపు మొట్ట మొదటి ప్లేయర్‌గా హర్మన్‌ప్రీత్ సరికొత్త రికార్డు సృష్టించింది. మెన్స్ లేదా ఉమెన్స్ క్రికెట్.. ఇలా ఏ విభాగంలో చూసినా ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్‌గా ఆమె చరిత్ర పుటల్లోకెక్కింది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ‘200’ నంబర్ ఉన్న ఒక స్పెషల్ జెర్సీతో పాటు ప్రత్యేకమైన క్యాప్‌ను జ్ఞాపికగా అందజేశారు. 

ఇంగ్లాండ్ గడ్డపైనే మొదలై.. ఇంగ్లాండ్‌లోనే 200వ మ్యాచ్: 
37 ఏళ్ల హర్మన్‌ప్రీత్ కౌర్ టీ20 కెరీర్ ఒక పర్‌ఫెక్ట్ స్క్రీన్‌ప్లేలా కొనసాగింది. ఆమె సరిగ్గా 17 ఏళ్ల క్రితం (2009లో) ఇంగ్లాండ్ వేదికగానే జరిగిన టి20 వరల్డ్ కప్ ఎడిషన్‌లో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లోకి డెబ్యూ చేసింది. ఇప్పుడు మళ్లీ అదే ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ మైదానంలో తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 200వ టీ20 మ్యాచ్ ఆడటం విశేషం.. ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎడిషన్లలోనూ ఆడిన ఏకైక ప్లేయర్‌గా ఆమె నిలిచింది. 

►ALSO READ | అట్టహాసంగా TG 20 లీగ్ ఓపెనింగ్ సెర్మనీ.. హాజరైన భట్టి, సిరాజ్, రౌడీ బాయ్ విజయ్

దూసుకుపోతున్న హర్మన్‌ప్రీత్ సేన: 
సౌతాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ మొదట బ్యాటింగ్ తీసుకుని జట్టును ముందుండి నడిపించింది. ఈ చారిత్రాత్మక మ్యాచ్ గురించి ఆమె మాట్లాడుతూ.. ఇదొక నమ్మలేని ప్రయాణమని, తాను ఈ స్థాయికి చేరుకుంటానని ఎప్పుడూ ఊహించలేదని భావోద్వేగానికి గురైంది. తన 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో సపోర్ట్‌గా నిలిచిన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, బీసీసీఐ (BCCI) కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. 

 

 

©️ VIL Media Pvt Ltd.