
Story Board: బంగారం ధర కాస్త తగ్గిందంటే చాలు కొనేందుకు పరుగెత్తేవారు వినియోగదారులు. ఇది ఈ ఏడాది ఆరంభం నాటి సీన్. కానీ ఇప్పుడు ధర తగ్గినా.. మార్కె ట్లో ఆ జోష్ కనిపించడం లేదు. అసలు ధర కంటే గ్రాముకు రూ.400 తగ్గించి అమ్ముతున్నా కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. కారణం ధర ఇంకా తగ్గుతుందన్న నమ్మకం ఒక్కటైయితే.. ఆర్థిక మాంద్యం మరోటి. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పసిడి, వెండి ధరలకు హద్దు లేకుండా పోయింది. ఏడాది పాటు దూసు కెళ్లడంతో ఆల్టైం రికార్డు ధరలు నమోద య్యాయి. 2025 జనవరిలో గ్రాము 916 బంగా రం రూ.6,600 ఉండగా క్రమంగా పెరు గుతూ రూ.19,200లకు చేరింది. క్రమంగా తగ్గుతూ రూ.14500 దగ్గర స్థిరంగా నిలబడిం ది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధంతో క్రూడ్ ధర పెరగడం, డాలర్తో రూపాయి క్షీణించడంతో కేంద్ర ప్రభుత్వం పసిడి దిగుమతులపై పన్నును పెంచింది. ఇటు బ్యాంకుల్లో బంగారం రుణాల మీద కూడా కొత్త నిబంధనలను తీసుకు రావడంతో పసిడి ధర ఒక్కసారిగా తగ్గు ముఖం పట్టింది. అయినా కొనేవాళ్లు కరువయ్యారు. ప్రస్తుతం నిత్యావసర ధరలు పెరగడం, రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతాయన్న ఊహాగానాలతో చాలామంది పొదుపుబాట పట్టారు. వచ్చే అదాయం ఇంటి ఖర్చులకే సరి పోతున్నాయి. ఇతర వస్తువుల్ని కొనేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఈ కారణంగా పసిడి అమ్మకాలు భారీగా పడ్డాయి.
వెండిది కూడా ఇదే పరిస్థితి. ఒక దశలో కేజీ వెండి రూ.4 లక్షలకు వెళ్లింది. ఈ ధర రూ.10 లక్షలకు చేరుతుందన్న ఊహాగానాలతో చాలామంది అప్పులు తెచ్చి మరీ కొన్నారు. అయితే మళ్లీ వెండి ఆ ధరకు చేరువకాలేదు. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి రూ.2.75 లక్షలు ఉంది. అంతర్జాతీయంగా వెండి, పసిడికి డిమాండ్ తగ్గింది. దీనికి యుద్ధమే కారణం, క్రూడ్ ధర పడటంతో ఆ ప్రభావం పసిడిపై పడింది. సాధారణంగా యుద్ధం వస్తే వెండి, బంగారం పెరగాలి,. కానీ ఈసారి రివర్స్ అయ్యాయి. ప్రభుత్వం దిగుమతులపై పన్నులు విధించడం, రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గుతాయన్న ఊహాగానాలు, మొన్నటిదాకా ఆన్సీజన్ కావడం ధరలు తగ్గుముఖానికి కారణంగా చెప్పవచ్చు.
అయితే పరిమాణం పరంగా దేశంలోకి పసిడి దిగుమతులు తగ్గినప్పటికీ.. అంతర్జాతీయంగా పసిడి ధరలు భారీగా పెరగడంతో దిగుమతి బిల్లు మాత్రం ప్రభుత్వానికి భారంగానే మారింది. ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకునే భారత్.. గత 2025-26 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 71.98 బిలియన్ డాలర్ల విలువైన 721.03 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణాంకాల ప్రకారం కొంతకాలంగా దేశంలో ఆభరణాల డిమాండ్ తగ్గుముఖం పట్టింది. టన్నుల కొద్దీ బంగారం కొనే మన దేశంలో.. గ్రాములు కొనడానికి కూడా సామాన్యుడు వెనుకాడుతున్నాడు. షాపులు కస్టమర్లు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వ్యాపారులు డిస్కౌంట్లు ఇస్తామన్నా జనం అడుగు ముందుకు వేయడం లేదు. శతాబ్దాలుగా వస్తున్న గోల్డ్ సెంటిమెంట్ను దాటి ప్రజలు ఆలోచిస్తున్నారు. బంగారం ధరలు తగ్గినా…కొనుగోళ్లు పెరగడకపోవడం ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పునకు ఒక నిదర్శనం. గోల్డ్ కొనుగోళ్లు తగ్గడం అనేది కేవలం ఒక లోహం ముచ్చట కాదు. ఇది దేశంలోని మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతోందనడానికి, వారి ఆర్థిక సందిగ్ధతకు ఒక ప్రత్యక్ష నిదర్శనం. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునకు జనం ఎలా స్పందిస్తారు అని చెప్పటానికి.. తగ్గిన గోల్డ్ డిమాండే ఉదాహరణ. కానీ అంతకుమించి మాంద్యం పరిస్థితులే పసిడిపై మోజును బలవంతంగా చంపేస్తున్నాయనే వాదన కూడా లేకపోలేదు.
ఈ ఏడాది ప్రారంభంలో అంతర్జాతీయ మార్కెట్లో రికార్డ్ స్థాయిలో ఒక ఔన్స్ బంగారం ధర దాదాపు 5,500 నుంచి 5,600 డాలర్ల దగ్గర ఆల్టైమ్ హైని తాకింది. కానీ, గడిచిన కొన్ని వారాల్లోనే అది ఏకంగా 4,200 డాలర్ల స్థాయికి పడిపోయింది. అంటే దాదాపు 15 నుంచి 20 శాతం వరకు క్షీణత. ఇరాన్ యుద్ధం మళ్లీ ఉద్రిక్తతలను పెంచుతోంది. ద్రవ్యోల్బణం భయపెడుతోంది.. అయినా సరే, సేఫ్ హెవెన్ గా భావించే బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయి.. దీని వెనుక గ్లోబల్ ఎకనామిక్ గేమ్ ఏంటన్న విశ్లేషణ సాగుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు 15శాతానికి పైగా తగ్గితే, ఇండియాలో కేవలం 4 నుంచి 5 శాతమే తగ్గాయి. దీనికి కారణం మన రూపాయి విలువ డాలర్తో పోలిస్తే బలహీనపడటం. అలాగే గత నెలలో కేంద్రం కస్టమ్స్ డ్యూటీని 6శాతం నుంచి 15శాతానికి పెంచడం. ఈ డ్యూటీ పెంపుతో మన దేశీయ మార్కెట్లో పూర్తి స్థాయిలో ధరల తగ్గుదల ప్రభావం కనిపించలేదు.
ప్రపంచవ్యాప్తంగా బంగారం ట్రేడింగ్ అంతా అమెరికన్ డాలర్లలోనే జరుగుతుంది. డాలర్కు, గోల్డ్కు ఎప్పుడూ వ్యతిరేక సంబంధమే. ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే బలంగా ఉంది. డాలర్ బలంగా మారినప్పుడు, ఇతర కరెన్సీలు ఉపయోగించే దేశాలకు బంగారం కొనడం ఖరీదైన వ్యవహారం. దీనివల్ల అంతర్జాతీయంగా పుత్తడికి డిమాండ్ తగ్గి, ధరలు తగ్గుముఖం పడతాయి. నిజానికి ఈ ఏడాది ప్రారంభంలో, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందని అందరూ భావించారు. వడ్డీ రేట్లు తగ్గితే బంగారం ధరలు పెరుగుతాయి. కానీ సీన్ రివర్స్ అయింది. అమెరికాలో ఇటీవల విడుదలైన ఉద్యోగాల గణాంకాలు చాలా బలంగా వచ్చాయి. దీనికి తోడు పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ముడిచమురు ధరలు బ్యారెల్కు పైపైకి ఎగబాకాయి. చమురు పెరగడంతో ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతుందనే భయాలు మొదలయ్యాయి. ఫలితంగా, యూఎస్ ఫెడ్ తన వడ్డీ రేట్ల కోతను సెప్టెంబర్ తర్వాతకు వాయిదా వేసింది. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నంత కాలం, పెట్టుబడిదారులు బంగారాన్ని వదిలి బాండ్లపై దృష్టి పెడతారు. ఎందుకంటే బంగారం ఎలాంటి వడ్డీని ఇవ్వదు, కానీ యూఎస్ బాండ్లు ప్రస్తుతం దాదాపు 1.74శాతం రియల్ ఈల్డ్ను అందిస్తున్నాయి. దీంతో గోల్డ్ డిమాండ్ తగ్గి…రేట్లు డౌనయ్యాయి.
దేశంలో బంగారం దిగుమతులు, కొత్త నిబంధనలు, డ్యూటీ పెంపు వల్ల వచ్చిన మార్పులు ఇప్పుడు పెద్ద చర్చగా మారాయి. బంగారం దిగుమతులు భారీగా పడిపోయాయి. నెలకు ముందు 75 నుంచి 100 మెట్రిక్ టన్నుల వరకు వచ్చిన దిగుమతులు ఇప్పుడు సుమారు 25 నుంచి 30 మెట్రిక్ టన్నులకు పడిపోయాయి. ఈ తగ్గుదలకి కేవలం ఇంపోర్ట్ డ్యూటీ పెరగడమే కాకుండా బంగారం డిమాండ్ కూడా తగ్గడం కారణం అని ఆయన అన్నారు. కస్టమ్స్ ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి బ్యాంకులను గోల్డ్ దిగుమతికి డిజిగ్నేటెడ్ ఇంపోర్టర్లుగా నోటిఫై చేయలేదు. దాంతో ప్రస్తుతం కేవలం మూడు నామినేటెడ్ ఏజెన్సీలు మాత్రమే బంగారం దిగుమతి చేయగలుగుతున్నాయి. వాటిలో MMTC కూడా ఉంది. సాధారణంగా ఇలాంటి నామినేటెడ్ ఏజెన్సీలు ప్రతి సంవత్సరం తిరిగి నోటిఫై అవుతాయి. ఈసారి ఆథరైజ్డ్ డీలర్ బ్యాంకులు లిస్టులో లేవు.
గత నెల 13న ప్రభుత్వం గోల్డ్ ఇంపోర్ట్ డ్యూటీని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. 2024 జూలైలో చేసిన డ్యూటీ తగ్గింపును మార్చింది. ఈ నిర్ణయం అనవసర దిగుమతులు తగ్గించడానికి, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గించడానికి తీసుకున్నారు. ఇండస్ట్రీ వర్గాలు మరోసారి గోల్డ్ మోనిటైజేషన్ పథకాలను ప్రోత్సహించాలని సూచిస్తున్నాయి. దేశంలో ఇళ్లలో వాడకంలో లేకుండా ఉన్న బంగారాన్ని వినియోగంలోకి తేవాలని అభిప్రాయం ఉంది. కానీ ప్రజలు తమ దగ్గర ఉన్న బంగారం మూలం చెప్పాల్సి వస్తుందనే భయం, పన్నుల తనిఖీలు వస్తాయనే ఆందోళన వల్ల ఇలాంటి పథకాల్లో పాల్గొనడం తగ్గింది. ప్రశ్నలు అడగరు అనే నమ్మకం ఉంటే మాత్రమే బంగారం వెల్లడిస్తారు, లేకపోతే దూరంగా ఉంటారు. ఇదే గోల్డ్ మోనిటైజేషన్లో పెద్ద సమస్యగా మారింది. అయితే పరిశ్రమ మళ్లీ ఈ పథకాన్ని బలంగా అమలు చేయాలని కోరుతోంది.
మొత్తంగా చూస్తే, బంగారం దిగుమతులు తగ్గడం ఒక వైపు ఆర్థిక విధానాల ప్రభావం చూపిస్తే, మరో వైపు మార్కెట్ డిమాండ్, నియంత్రణ వ్యవస్థలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ మార్పులు బంగారం ధరలు, వినియోగం మీద ఎలా ప్రభావం చూపుతాయో చూడాలి. దేశీయ దిగుమతుల్లో ముడి చమురు తర్వాత ఎక్కువగా ఉంటున్నవి బంగారం దిగుమతులే. అయితే అమెరికా-ఇరాన్ యుద్ధంతో తగ్గిన క్రూడాయిల్ సరఫరా, అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ధరలు భారత్కు ఇబ్బందికరంగా మారాయి. కాగా, ఖరీదెక్కిన క్రూడ్తో ఎరువుల కొనుగోళ్లు సైతం భారంగా మారాయి. ఈ తరుణంలో దేశంలోని ఫారెక్స్ రిజర్వులు వేగంగా కరిగిపోతున్నాయి. పెరుగుతున్న ధరలతో ఎక్కువగా చెల్లింపులు చేయాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలోనే బంగారం దిగుమతుల్ని తగ్గించుకుంటే అలా మిగిలిన ఫారెక్స్ రిజర్వులను ఇతర చమురు, చమురేతర దిగుమతులకు వినియోగించుకోవచ్చన్నదే కేంద్ర ప్రభుత్వం భావన. అందుకే ఈ సుంకాల పెంపు అని ప్రభుత్వ పెద్దల మాట. అంతేగాక డాలర్తో పోల్చితే ఆల్టైమ్ గరిష్ఠాలకు దిగజారుతున్న రూపాయి మారకం విలువకు కూడా దన్ను లభిస్తుందని అంటున్నారు. దిగుమతిదారుల నుంచి డాలర్లకు తగ్గే డిమాండ్ రూపాయికి లాభిస్తుందన్నది వారి వాదన.
ఇదిలావుంటే కరెంట్ ఖాతా లోటును అదుపు చేయడానికి బంగారం, వెండి దిగుమతులపై సుంకాలనే పెంచనక్కర్లేదని రిటైల్ జ్యుయెల్లర్స్ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయంతో దేశీయ మార్కెట్.. ముఖ్యంగా చిన్న, మధ్యతరహా సంస్థలు, పరిశ్రమలు కుదేలవుతాయన్న ఆందోళనను వెలిబుచ్చుతున్నారు. దిగుమతి కోటాలను లేదా బంగారం, వెండిపై లైసెన్సింగ్ పరిమితులతో కూడా క్యాడ్ను అదుపు చేయవచ్చని చెప్తున్నారు. మరోవైపు స్మగ్లింగ్ పెరిగే వీలుండటంతో ఆ దిశగా రెవెన్యూ ఇంటెలిజెన్స్, కస్టమ్స్ అధికారులు నిఘా పెంచుతున్నారు. నౌకాశ్రయాలు, విమానాశ్రయాల్లో మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్తున్నారు.
దేశంలోని ప్రజల వద్ద పెద్ద ఎత్తున బంగారం ఉండటంతో దాన్ని బయటకు తెస్తే దిగుమతులపై భారాన్ని తగ్గించవచ్చని నగల వ్యాపారులు అంటున్నారు. నిజానికి 2015లో ఈ ఉద్దేశంతోనే మోదీ సర్కార్ పసిడి నగదీకరణ పథకాన్ని తెచ్చింది. అయితే దీనికి తగినంత స్పందన లేకపోవడంతో 2025లో ఆపేసింది. అయినప్పటికీ స్వల్ప కాలపరిమితితో బ్యాంకుల ఇష్టప్రకారం కొనసాగించుకొనే వెసులుబాటును కల్పించింది. ఇక ఈ పథకంలో దాదాపు 39,044 కిలోల బంగారాన్ని ప్రజలు, సంస్థలు, మదుపర్లు ఇతరత్రా మార్గాల ద్వారా సమీకరించినట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. డిజిటల్ గోల్డ్ను ప్రోత్సహించేలా గతంలోనే సావరిన్ గోల్డ్ బాండ్ పథకాన్ని కూడా కేంద్రం అమలు చేసింది. అయితే అధిక ధరల తరుణంలో నిర్వహణ భారంగా మారడంతో ప్రభుత్వం గతేడాది దీన్ని ఆపేసింది.
రెండేళ్లుగా చైనా, రష్యా, ఇండియాతో సహా ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు టన్నుల కొద్దీ బంగారాన్ని కొనుగోలు చేస్తూ వచ్చాయి. అయితే, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం, ఈ ఏడాది మొదటి క్వార్టర్లో సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు దాదాపు 22శాతం తగ్గాయి. బంగారం ధరలు విపరీతమైన గరిష్ట స్థాయికి చేరడంతో, బ్యాంకులు కూడా కొత్త కొనుగోళ్లను కాస్త ఆపి, ప్రాఫిట్ బుకింగ్ వైపు మొగ్గు చూపాయి. అలాగే రష్యా సెంట్రల్ బ్యాంకు కూడా భారీగా భౌతిక బంగారం అమ్మేసుకుంటోంది. ఉక్రెయిన్ నాలుగేళ్లుగా యుద్ధం చేస్తున్న రష్యా…వార్ను కంటిన్యూ చెయ్యడానికి అవసరమైన వనరులను సమకూర్చుకోవడానికి గోల్డ్ వదిలించుకుంటోంది. ఈ నాలుగు నెలల్లో సుమారు 30 టన్నుల గోల్డ్ను అమ్మేసింది.
ఫిజికల్ గోల్డ్ కు డిమాండ్ తగ్గడం కూడా రేట్ల పడిపోవడానికి మరో కారణం. భారత్, చైనా వంటి దేశాల్లో ఆభరణాల డిమాండ్ గణనీయంగా పడిపోయింది. 2025, 2026 లలో ధరలు లక్షన్నర దాటడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు బంగారం కొనడం తగ్గించేశారు. పెళ్లిళ్ల సీజన్ ఉన్నప్పటికీ, లైట్ వెయిట్ జ్యువెలరీ లేదా పాత బంగారాన్ని మార్పిడి చేసుకోవడం పెరిగింది.
మన దేశంలో బంగారం ధర పూర్తిగా అంతర్జాతీయ మార్కెట్ మీద మాత్రమే ఆధారపడి ఉండదు. కొన్ని లోకల్ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. డాలర్-రూపాయి మార్పిడి రేటు అందులో ఒకటి. రూపాయి బలహీనపడితే మనం దిగుమతి చేసుకునే బంగారం ఖరీదవుతుంది. దిగుమతులు కూడా తగ్గుతాయి. మరోవైపు డిజిటల్ గోల్డ్, ETFల ట్రెండ్ బాగా పెరిగింది. భౌతిక బంగారం కంటే ఇప్పుడు యువత గోల్డ్ ఇటిఎఫ్లు, డిజిటల్ గోల్డ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ధరలు భారీగా పెరగడంతో మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ ఈటిఎఫ్ ఇన్ఫ్లో కూడా తగ్గింది. డిమాండ్ సప్లై సూత్రం ప్రకారం…డిమాండ్ డౌనయ్యింది…రేటు దిగొచ్చింది.