Reading Time: 2 minutes

ఫొటో కోసం మెలోనీ బతిమాలిందన్న ట్రంప్.. అంత ఖర్మేం పట్టలేదన్న మెలోనీ !

Caption of Image.

G7 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా తనతో ఫోటో దిగే అవకాశం కోసం ఇటలీ ప్రధాని జార్జియో మెలోని ఆత్రుతగా ఎదురుచూశారని.. కేవలం ఆమెపై జాలి కలగడం వల్లే తాను అంగీకరించానని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను మెలోని శుక్రవారం తీవ్రంగా ఖండించారు. “ఆమె నాతో ఒక ఫోటో దిగాలని నన్ను బతిమాలింది! నాతో ఫోటో దిగాలని ఆమెకు అంతగా కోరిక ఉండేది. నిజానికి నేను ఆ పని చేసేవాడిని కాదు, కానీ ఆమె పరిస్థితి చూసి నాకు జాలి వేసింది.” అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై మెలోనీ తీవ్రంగా స్పందించారు.

‘‘ట్రంప్ వ్యాఖ్యలు విని నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. ట్రంప్ వ్యాఖ్యలు పూర్తిగా కల్పితం’’ అని ఆమె ఒక వీడియో విడుదల చేశారు. తాను గానీ, ఇటలీ గానీ ఎన్నడూ యాచించేది లేదని ఆమె స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సొంత మిత్ర దేశాలతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తారో తనకు అర్థం కావడం లేదని మెలోనీ విస్మయం వ్యక్తం చేశారు. ట్రంప్ అనుచిత వ్యాఖ్యలతో అమెరికా, ఇటలీ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బ తినే పరిస్థితులున్నాయి.

►ALSO READ | మాస్కోపై ‘బ్లాక్ రెయిన్’: ఉక్రెయిన్ దెబ్బకు రష్యా రాజధానిలో హై అలర్ట్

ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ కూడా ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. జూన్ 21, 22 తేదీల్లో జరిగే సమావేశాల నిమిత్తం అమెరికాకు వెళ్లబోనని ఆయన ప్రకటించారు. ట్రంప్ వ్యాఖ్యలు మెలోనీకే కాదని.. యావత్ ఇటలీని కూడా కించపరిచాయని చెప్పారు.

వాషింగ్టన్ తో బలమైన సంబంధాలు కొనసాగిస్తూనే.. యూరప్, నాటోలో ఇటలీ పాత్రను బలోపేతం చేసేందుకు మెలోనీ చేస్తున్న ప్రయత్నాలకు ఈ బహిరంగ ఘర్షణ ఒక కొత్త సవాల్ విసిరింది. నాటో కూటమిలో అమెరికాకు ఇటలీ తగినంత సహకరించడం లేదని ట్రంప్ గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. అంతర్జాతీయ భద్రతా సమస్యలపై రోమ్ వైఖరిని ట్రంప్ పదేపదే విమర్శించారు.

©️ VIL Media Pvt Ltd.