Reading Time: < 1 minute
Hyderabad: నీట్ రీ-ఎగ్జామ్‌కు గంటల ముందే దారుణం.. మరో విద్యార్థిని బలి

హైదరాబాద్‌, జూన్‌ 21: నీట్‌ రీ ఎగ్జామ్‌కు కేవలం కొన్ని గంటల ముందే దారుణ ఘటన చోటు చేసుకుంది. పరీక్ష ఒత్తిడికి మరో విద్యార్ధిని బలి అయింది. నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థిని గదిలో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన హైదరాబాద్‌లోని మియాపూర్‌ పరిధిలో శనివారం (జూన్‌ 20) చోటు చేసుకుంది. మియాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ శివప్రసాద్‌ అందించిన వివరాల ప్రకారం..

వైఎస్‌ఆర్‌కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన షేక్‌ సనా (19) నీట్‌ ఎగ్జామ్‌కు సిద్ధం అవుతోంది. తండ్రి ఉద్యోగ రీత్యా కువైట్‌లో ఉంటుండగా, పది రోజుల కిందట షేక్‌ సనా తల్లి అబ్బునిసా సొంతూరికి వెళ్లింది. దీంతో సనా తన ఇద్దరు చెల్లెళ్లు మియాపూర్‌లోని జయబేరి కల్పనా అపార్ట్‌మెంట్‌లో కలిసి ఉంటుంది. ఎప్పటి మాదిరిగానే శనివారం కూడా చదువుకునేందుకు షేక్‌ సనా తన గదిలోకి వెళ్లింది. అయితే సాయంత్రం అయినా ఆమె బయటకు రాకపోయేసరికి ఆమె చెల్లెళ్లు గది తలుపులు తెరిచి చూడగా ఒక్కసారిగా షాకయ్యింది. సనా ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకొని కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సనా రాసిన లేఖ పోలీసులకు లభ్యమైంది. ప్రాథమిక విచారణలో చదువుకు సంబంధించిన ఒత్తిడి, కుటుంబ అంచనాలు, గత పరీక్షల ఫలితాలపై ఆందోళన కారణంగా సనా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు.

సూసైడ్‌ లేఖలో తన నిర్ణయానికి ఇతరులు ఎవరూ బాధ్యులు కాదని పేర్కొన్నట్లు వివరంగా వివరించింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పరీక్షల ఒత్తిడి.. పెరుగుతున్న ఆందోళన.. పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి, ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన మరోసారి ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై తల్లిదండ్రులు, విద్యాసంస్థలు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. నీట్‌ పేపర్‌ లీక్‌ నీట్ రీ ఎగ్జాం మళ్లీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రీఎగ్జాం నేపథ్యంలో ఇప్పటికే దేశ వ్యాప్తంగా పదుల సంఖ్యలో విద్యార్ధులు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.