Reading Time: 2 minutes
Bandla Ganesh: మాట నిలబెట్టుకున్న బండ్ల గణేష్.. పవన్ అభిమాని నిరంజన్‌‌కు ఆర్థిక సాయం

కొద్ది రోజుల క్రితం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిరంజన్ అనే తన చిన్నారి అభిమానిని స్వయంగా వచ్చి కలిసిన సంగతి తెలిసిందే. వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన నిరంజన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ ను కలవాలన్న కోరికను బయటపెట్టాడు నిరంజన్. ఈ విషయం తెలుసుకున్న పవర్ స్టార్ వెంటనే వరంగల్ వచ్చి ఈ పిల్లాడిని కలిశారు. తిరుమల శ్రీవారి తీర్థం, ప్రసాదాలు అందించి బాలుడికి ధైర్యం చెప్పారు. అంతేకాదు పిల్లాడు అడిగిన వెంటనే ట్యాబ్, ఓ పెట్ డాగ్ ను బహుమతిగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ స్ఫూర్తితే నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కూడా నిరంజన్ ను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. పిల్లాడికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేస్తానని ఇది వరకే ప్రకటించారు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నారు బండ్లన్న.

శనివారం (జూన్ 20) హనుమకొండ హనుమాన్ నగర్‌లోని నిరంజన్ నివాసానికి వెళ్లిన బండ్ల గణేశ్, చిన్నారితో చాలా సేపు ముచ్చటించారు. ధైర్యంగా ఉండాలని పిల్లాడితో చెప్పారు. అనంతరం తల్లిదండ్రులు రాంగోపాల్ చారి, మానసలతోనూ మాట్లాడి నిరంజన్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తన పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ తరఫున రూ.5 లక్షల చెక్‌ను వారికి అందజేసి, భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

‘నేను ఇప్పుడు నా కూతురు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాను. అయినా ఈరోజే వచ్చి సాయం చేయాలని నిర్ణయించుకున్నాను. నేను పవన్ కల్యాణ్ గారి భక్తుడిని. ఆయన వచ్చి పరామర్శించినప్పుడే నిరంజన్ స్ఫూర్తితోనే. పవన్ కల్యాణ్ స్ఫూర్తితోనే నేను ఈ రోజు ఇక్కడికి వచ్చి ఆర్థిక సాయం చేశాను. రూ.5 లక్షల సాయాన్ని నిరంజన్ కుటుంబానికి అందించడం ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. బాబు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చారు బండ్ల గణేష్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. బండ్ల గణేష్ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

చిన్నారి నిరంజన్ తో బండ్ల గణేష్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.