
India A vs Sri Lanka A Final: భారత్-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య ఆదివారం (జూన్ 21) ముక్కోణపు సిరీస్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ ఫైనల్కు ముందు శ్రీలంక కెప్టెన్ సహన్ అరచ్చిగే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని లక్ష్యంగా చేసుకుని తాము ఆడమని స్పష్టం చేశాడు. ఇటీవల ఇరు జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్లో వైభవ్, శ్రీలంక ఆటగాళ్ల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం పెద్ద చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఫైనల్లో అతడిని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తారా? అనే ప్రశ్నకు శ్రీలంక-ఏ కెప్టెన్ ఈ విధంగా సమాధానం ఇచ్చాడు.
అఫ్గానిస్థాన్-ఏపై 103 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన శ్రీలంక-ఏ ఫైనల్కు చేరుకుంది.సహన్ అరచ్చిగే మాట్లాడుతూ… ‘మా ఆటగాళ్లు ఎవరినీ టార్గెట్ చేయడం లేదు. మేము మా ఆటను ఆస్వాదిస్తున్నాం. సూపర్ ఓవర్ లాంటి ఉత్కంఠభరితమైన మ్యాచ్ల్లో భావోద్వేగాలు బయటపడటం సహజం. అందులో అసాధారణం ఏమీ లేదు. అది జరిగిపోయిన ఘటన. మేం ఫైనల్పైనే దృష్టి పెట్టాము. గెలిచేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తాం’ అని తెలిపాడు.
లీగ్ దశలో భారత్-ఏ, శ్రీలంక-ఏ మధ్య జరిగిన మ్యాచ్ టైగా ముగియడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. చివరి మూడు బంతుల్లో 14 పరుగులు అవసరమైన సమయంలో బ్యాటింగ్ చేసిన వైభవ్ సూర్యవంశీ భారత్ను గెలిపించలేకపోయాడు. ఆ సమయంలో శ్రీలంక ఆటగాళ్లు స్లెడ్జింగ్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ముఖ్యంగా విషేన్ హలంబాగేతో వైభవ్కు వాగ్వాదం జరగగా.. ఇద్దరి మధ్య తోపులాట కూడా చోటుచేసుకుంది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫైనల్కు ముందు తమ జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉందని లంక కెప్టెన్ సహన్ అరచ్చిగే తెలిపాడు. ‘మా బ్యాటింగ్ విభాగంలో ఎలాంటి సమస్య లేదు. బౌలింగ్లో కూడా పేసర్లు, స్పిన్నర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ప్రస్తుతం మా జట్టు మంచి స్థితిలో ఉంది’ అని చెప్పాడు.
మరోవైపు మాజీ భారత కెప్టెన్, 1983 ప్రపంచకప్ విజేత కృష్ణమాచారి శ్రీకాంత్ ఇటీవల వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపించారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అతడు ప్రేక్షకులను టీవీల ముందు కూర్చోబెట్టే ప్రత్యేక ఆకర్షణను సంపాదించుకున్నాడని పేర్కొన్నారు. ఇప్పుడు ఫైనల్లో వైభవ్ ఎలా రాణిస్తాడు?. లీగ్ మ్యాచ్లో జరిగిన ఘటనకు బ్యాట్తో సమాధానం ఇస్తాడా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. భారత్-ఏ, శ్రీలంక-ఏ మధ్య టైటిల్ పోరు ఉత్కంఠభరితంగా సాగనుంది. డంబుల్లా క్రికెట్ స్టేడియంలో రేపు ఉదయం 10 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.