
Allu Arjun: హైదరాబాద్లోని ప్రముఖ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా అల్లు అర్జున్తో పాటు మిగిలిన నిందితులకు కోర్టు సమన్లు జారీ చేసింది. రాబోయే సోమవారం నాడు కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ న్యాయస్థానం తన ఉత్తర్వుల్లో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఈ దురదృష్టకర తొక్కిసలాట ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి దాఖలైన ఛార్జ్షీట్లో పోలీసులు అల్లు అర్జున్ను A11గా చేర్చారు.
ఈ తొక్కిసలాట ఘటనపై సుదీర్ఘంగా దర్యాప్తు జరిపిన పోలీసులు.. అల్లు అర్జున్ సహా మొత్తం 23 మందిని బాధ్యులుగా చేరుస్తూ ఇప్పటికే న్యాయస్థానంలో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇందులో ప్రధాన నిందితులుగా సంధ్య థియేటర్ యాజమాన్యం, నిర్వాహకులు ఉన్నారు. ఈ ఛార్జ్ షీట్ను పరిశీలించిన నాంపల్లి కోర్టు.. కేసు తదుపరి విచారణను వేగవంతం చేస్తూ, అల్లు అర్జున్తో పాటు కేసులో నిందితులుగా ఉన్న మరో 19 మందికి సమన్లు జారీ చేసింది. వారంతా సోమవారం నాడు తప్పనిసరిగా న్యాయస్థానానికి రావాలని స్పష్టం చేసింది. ఇక, పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో రోజున అభిమానులు, ప్రేక్షకులు భారీ సంఖ్యలో తరలిరావడం, అక్కడ సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో తొక్కిసలాట జరిగి ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఈ వ్యవహారంలో శాంతిభద్రతల సమస్య తలెత్తడానికి, నిర్లక్ష్యానికి కారణమయ్యారంటూ పోలీసులు నమోదు చేసిన కేసు ఇప్పుడు కోర్టు విచారణ దశకు చేరుకుంది. నాంపల్లి కోర్టు తాజా సమన్లతో అల్లు అర్జున్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.