Reading Time: 3 minutes
కట్టర్ హిందూ.. నిజాం రాజుకు ప్రాణస్నేహితుడు! ది హీరో ఆఫ్ మూసీ ఫ్లడ్స్.. ఎవరో తెలుసా?

ఏడుగురు భార్యలు, పదుల సంఖ్యలో పిల్లలు ఉన్న వ్యక్తి అని ఆయన గురించి తక్కువ అంచనా వేయకండి.. ఆయన గొప్ప రాజనీతజ్ఞుడు, తత్వవేత్త, కవి.. అంతకంటే మించి రెండు సార్లు హైదరాబాద్ సంస్థానానికి ప్రధాన మంత్రిగా సేవలు అందించారు. ఆయనే మహారాజా సర్ కిషన్ షెర్షాద్. హైదరాబాద్ చరిత్రలో కిషన్ పెర్షాద్ పేరు అద్భుతమైన నాయకత్వం, అంతులేని దయ, సాంస్కృతిక సామరస్యానికి పర్యాయపదంగా నిలుస్తుంది. ప్రజల మహారాజుగా ప్రశంసలు అందుకున్న ఆయన, ఆరవ నిజాం మహబూబ్ అలీ ఖాన్‌కు బాల్య మిత్రుడిగా, తరువాత ప్రపంచంలోని అత్యంత సంపన్న రాజ్యానికి రెండుసార్లు ప్రధానమంత్రిగా సేవలు అందించిన ఘనత కలిగి ఉన్నారు. కిషన్ పర్షాద్ జీవితం నిజమైన గంగా-జమునీ తెహజీబ్కు జీవన సాక్ష్యంగా నిలిచింది.

ఆయన బాల్యంలో నిజాంతో కలిసి సాలార్ జంగ్ I పర్యవేక్షణలో విద్యాభ్యాసం చేశారు, ఇది వారికి బలమైన బంధాన్ని ఏర్పరిచింది. రాజకీయాలతో పాటు, ఆయన పర్షియన్ సాహిత్యం, ఉర్దూ కవిత్వం, సంస్కృతం, సూఫీ తత్వశాస్త్రంలో లోతైన జ్ఞానాన్ని సంపాదించారు. ఈ విభిన్నమైన విద్యా నేపథ్యమే ఆయనను భవిష్యత్తులో సమర్థవంతమైన, పరిణతి చెందిన నాయకుడిగా తీర్చిదిద్దింది.

ప్రధానమంత్రిగా కిషన్ పర్షాద్ పరిపాలనా సంస్కరణలకు విశేష కృషి చేశారు. కస్టమ్స్, రైల్వేలు, వ్యవసాయ రంగాలలో ఆయన తీసుకున్న చర్యలు రాష్ట్ర ఖజానాను గణనీయంగా పెంచాయి. విద్యకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన ఆయన, ఉస్మానియా విశ్వవిద్యాలయ స్థాపన, అభివృద్ధికి బలమైన మద్దతుదారుగా నిలిచారు. స్థానిక ప్రజల ప్రయోజనాలను కాపాడాలనే లక్ష్యంతో, ప్రభుత్వ ఉద్యోగాలలో హైదరాబాదీలకు ప్రాధాన్యతనిచ్చే ముల్కీ నిబంధనలను ఆయన గట్టిగా సమర్థించారు, ఇవి తరువాత హైదరాబాద్ పరిపాలనలో కీలక భాగంగా మారాయి.

1908లో సంభవించిన భయంకరమైన మూసీ నది వరదల సమయంలో, కిషన్ పర్షాద్ చూపిన ధైర్యం, కరుణ ఆయన్ని మూసీ వరద హీరోగా ప్రజల హృదయాల్లో నిలిపింది. ఆయన స్వయంగా మునిగిపోయిన ప్రాంతాలకు వెళ్లి, ప్రజలకు తక్షణ సహాయం అందించారు, ఆహారం, ఆశ్రయం కల్పించారు. పేదల రుణాలను రద్దు చేయడంతో పాటు, కూలీలకు ముందస్తు జీతాలు చెల్లించి వారిని ఆదుకున్నారు. ఈ చర్యలు ఆయనను నిజమైన ప్రజా నాయకుడిగా నిరూపించాయి.

గంగా జమునా తెహజీబ్..

కిషన్ పర్షాద్ వ్యక్తిగత జీవితం కూడా దక్కన్ మిశ్రమ సంస్కృతికి అద్దం పట్టింది. హిందువు అయినప్పటికీ, ఆయనకు హిందూ, ముస్లిం భార్యలు ఉండేవారు, తన పిల్లలను వారి తల్లి మతం ప్రకారం పెంచడానికి అనుమతించారు. ఆయనకు మొత్తం ఏడుగురు భార్యలు అని చరిత్ర పుస్తకాలు చెబుతున్నాయి. అందులో ముగ్గురు హిందువులు కాగా, నలుగురు ముస్లిం మహిళలు ఉన్నారు. మత సామరస్యానికి ఆయన జీవితం ఒక అద్భుతమైన ఉదాహరణ. షాద్ అనే కలం పేరుతో ఆయన గొప్ప కవిగా కూడా ప్రసిద్ధి చెందారు. హైదరాబాద్ సమీపంలోని షాద్‌నగర్ పట్టణం ఆయన కలం పేరు మీదుగానే వచ్చిందని చెబుతారు. ఆయన రచనలు మతపరమైన విభేదాలను అధిగమించి మానవత్వం, ప్రేమ గురించి మాట్లాడాయి. కళలను, కళాకారులను పోషించిన కిషన్ పర్షాద్ నివాసం కిషన్ పర్షాద్ దియోడి కవులు, పండితులకు కేంద్రంగా ఉండేది.

ఆయన దయాగుణానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఒకసారి తన రాజభవనంలోకి ప్రవేశించిన యాచకుడిని, కావలిదారులు అడ్డుకోగా, కిషన్ పర్షాద్ వారించి, ఆ యాచకుడిని గౌరవంగా తన ఖరీదైన సోఫాలో కూర్చోబెట్టారు. “దేవుడు ఏ రూపంలో మన ముందుకు వస్తాడో మనకు తెలియదు. ఎవరినీ తక్కువగా చూడకండి” అనే ఆయన మాటలు ఆయనలోని మానవతా దృక్పథాన్ని తెలియజేస్తాయి. నగర పర్యటనలకు వెళ్ళినప్పుడు తన బగ్గీలో నాణేల సంచులను ఉంచుకుని, పేదలకు దానం చేసేవారు. కిషన్ పర్షాద్ ఇంటి నుండి ఏ అవసరమైన వారైనా ఖాళీ చేతులతో వెళ్ళరనే నానుడి ఆయన దాతృత్వానికి నిదర్శనం.

1940లో ఆయన మరణించినప్పుడు, ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ “మొఘల్ సామ్రాజ్యం చివరి చిహ్నం వెళ్లిపోయింది” అని తీవ్ర దుఃఖంతో వ్యాఖ్యానించారు. నిజాం ఇక్కడ కేవలం ఒక వ్యక్తి గురించే కాకుండా, కిషన్ పర్షాద్‌లో ప్రతిబింబించిన ప్రాచీన సంస్కృతి, సౌజన్యం, కవితాత్మక స్వభావం, ఇండో-పర్షియన్ సాంస్కృతిక వారసత్వం గురించి మాట్లాడారు. షాద్‌నగర్, ఉస్మానియా విశ్వవిద్యాలయ వారసత్వం, ఆయన దాతృత్వ కథలు, అల్వాల్‌లోని ఆయన కుటుంబ చిహ్నాల ద్వారా కిషన్ పర్షాద్ ముద్ర నేటికీ దక్కన్ మట్టిలో నిలిచి ఉంది. విభిన్న మతాలు, భాషల ప్రజలు కలిసి గౌరవంగా జీవించడమే ఒక సమాజ గొప్పతనమని ఆయన జీవితం నిరూపించింది.

రెండు సార్లు ప్రధాన మంత్రిగా..

హైదరాబాద్ సంస్థాన చరిత్రలో విశిష్ట స్థానాన్ని సంపాదించిన ప్రముఖ రాజనీతిజ్ఞుడు, కవి, సాహిత్యాభిమాని మహారాజా సర్ కిషన్ పెర్షాద్ బహదూర్. నిజాం పాలనలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన, హైదరాబాద్ రాజ్యానికి రెండు సార్లు ప్రధాన మంత్రిగా (దివాన్‌గా) పనిచేసి పరిపాలనా రంగంలో తనదైన ముద్ర వేశారు. రాజకీయ చాతుర్యం, సాంస్కృతిక అభిరుచి, ప్రజల పట్ల మమకారంతో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. కిషన్ పెర్షాద్ 1864 జనవరి 28న హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన కుటుంబం నిజాం ఆస్థానంలో ప్రభావవంతమైన కుటుంబంగా పేరొందింది. చిన్న వయస్సులోనే పర్షియన్, ఉర్దూ, అరబిక్, సంస్కృతం వంటి భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. సాహిత్యం, సంగీతం, కళల పట్ల ఆయనకు అపారమైన ఆసక్తి ఉండేది. ఉర్దూ కవిగా కూడా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు.

ఆరవ నిజాం మహబూబ్ అలీ ఖాన్ పాలనలో కిషన్ పెర్షాద్ రాజకీయంగా ఎదిగారు. పరిపాలనలో తన ప్రతిభను నిరూపించుకున్న ఆయనను 1901లో హైదరాబాద్ రాష్ట్ర ప్రధాన మంత్రిగా నియమించారు. 1912 వరకు ఈ పదవిలో కొనసాగిన ఆయన, పరిపాలనా సంస్కరణలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు అనేక చర్యలు చేపట్టారు. తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో మరోసారి ఆయనకు ప్రధానమంత్రి బాధ్యతలు అప్పగించారు. 1926 నుంచి 1937 వరకు రెండోసారి దివాన్‌గా పనిచేసిన కిషన్ పెర్షాద్, రాష్ట్ర అభివృద్ధికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్య, మౌలిక సదుపాయాలు, నీటిపారుదల, ప్రజా సేవల విస్తరణకు ప్రాధాన్యత ఇచ్చారు.

హీరో ఆఫ్ ది మూసీ ఫ్లడ్స్..

1908 సెప్టెంబర్ 28న హైదరాబాద్‌ను అతలాకుతలం చేసిన మూసీ నది మహా వరదలు నగర చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటనగా నిలిచాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఆ సమయంలో హైదరాబాద్ రాష్ట్ర ప్రధాన మంత్రి (దివాన్)గా ఉన్న మహారాజా సర్ కిషన్ పెర్షాద్ సహాయక చర్యల్లో కీలక పాత్ర పోషించారు. వరదలు సంభవించిన వెంటనే కిషన్ పెర్షాద్ ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి సహాయక చర్యలను వేగవంతం చేశారు. మృతదేహాల తొలగింపు, బాధితులకు ఆహారం, తాగునీరు, తాత్కాలిక ఆశ్రయాలు కల్పించడం వంటి పనులను సమన్వయం చేశారు. నగరంలోని పలు ప్రభుత్వ భవనాలు, ధర్మశాలలు, పాఠశాలలను వరద బాధితుల కోసం తెరవాలని ఆదేశించారు.

కిషన్ పెర్షాద్ వ్యక్తిగతంగా కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. తన స్వంత నిధుల నుంచి విరాళాలు అందించడంతో పాటు ఇతర జాగీర్దారులు, ధనిక వర్గాలను కూడా విరాళాలు ఇవ్వాలని ప్రోత్సహించారు. ఆయన దాతృత్వం కారణంగా వేలాది మంది బాధితులకు అత్యవసర సాయం అందింది. ఈ విపత్తు అనంతరం నగరాన్ని భవిష్యత్తులో వరదల నుంచి రక్షించేందుకు శాశ్వత చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని కిషన్ పెర్షాద్ ప్రభుత్వం గుర్తించింది. నిజాం మహబూబ్ అలీ ఖాన్ ఆదేశాల మేరకు ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను హైదరాబాద్‌కు ఆహ్వానించారు. ఆయన సూచనల ఆధారంగా మూసీ నది వరద నియంత్రణ, నగర డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, జలాశయాల నిర్మాణంపై ప్రణాళికలు రూపొందించారు.