
Health Tips : ప్రస్తుతం మార్కెట్లో ఊదా రంగులో ఉండే నేరేడు పండ్లు (జామూన్) చాలా ఎక్కువగా లభిస్తున్నాయి. ఈ పండు ఆరోగ్యానికి చేయడమే కాకుండా, దీని గింజలు మధుమేహ (డయాబెటిస్) వ్యాధిగ్రస్తులకు ఒక సంజీవనిలా పనిచేస్తాయని మన పెద్దలు చెబుతుంటారు. మధుమేహ రోగులలో రక్తంలో చక్కెర స్థాయిలను సహజ సిద్ధంగా నియంత్రించడానికి ఆయుర్వేదం కొన్ని అద్భుతమైన మూలికలను గుర్తించింది. వాటిలో నేరేడు గింజలు, మెంతులు , గుర్మార్ (పొడపత్రి) ముఖ్యమైనవి. ఈ మూడు పదార్థాల పొడి మిశ్రమాన్ని సరైన పద్ధతిలో తీసుకోవడం వల్ల డయాబెటిస్ రోగులలో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి.
డయాబెటిస్పై పనిచేసే ఆయుర్వేద మూలికల ప్రత్యేకత
ఆయుర్వేదంలో పూర్వ కాలం నుంచే మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి నేరేడు గింజలను ఉపయోగిస్తున్నారు. వీటిలో ఉండే కొన్ని ప్రత్యేక సహజ సమ్మేళనాలు శరీరం గ్లూకోజ్ను ఉపయోగించుకునే విధానాన్ని మెరుగుపరుస్తాయి. బంగ్లాదేశ్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ అధ్యయనం ప్రకారం.. నేరేడు గింజలలోని యాంటీ-డయాబెటిక్ లక్షణాలు రక్తంలో చక్కెరను తగ్గించడానికి (హైపోగ్లైసీమిక్), ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడానికి, ప్యాంక్రియాటిక్ బీటా-కణాలను సంరక్షించడానికి , ప్రేగులలో గ్లూకోజ్ శోషణను క్రమబద్ధీకరించడానికి ఎంతగానో తోడ్పడతాయి.
అలాగే, ఈ మిశ్రమంలో వాడే గుర్మార్ (దీనిని గుడ్మార్ లేదా పొడపత్రి అని కూడా పిలుస్తారు) మధుమేహానికి ఉత్తమమైన ఆయుర్వేద మూలికగా పేరుగాంచింది. అందుకే దీనిని ఆయుర్వేదంలో “మధు నాశిని” అంటారు. ఇది టైప్-1 , టైప్-2 మధుమేహం రెండింటినీ నియంత్రించడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా స్వీట్లు తినాలనే తీవ్రమైన కోరికలను (షుగర్ క్రేవింగ్స్) అరికట్టడంలో , గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది. ఇక మూడో పదార్థమైన మెంతి గింజల విషయానికి వస్తే.. మెంతులలో కరిగే పీచుపదార్థం (సాల్యుబుల్ ఫైబర్) ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో పిండిపదార్థాల (కార్బోహైడ్రేట్స్) శోషణను నెమ్మదింపజేస్తుంది. తద్వారా భోజనం చేసిన వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు ఒకేసారి వేగంగా పెరగకుండా అడ్డుకుంటుంది.
ఆయుర్వేద పొడి మిశ్రమాన్ని తయారుచేసే విధానం
ఇంట్లోనే ఈ శక్తివంతమైన పొడిని తయారు చేసుకోవడానికి సమాన పద్ధతిలో ఈ క్రింది వస్తువులను సిద్ధం చేసుకోవాలి.. మెంతులు – 100 గ్రాములు..ఎండిన జామూన్ (నేరేడు) గింజల పొడి – 100 గ్రాములు.. గుర్మార్ (పొడపత్రి) పొడి – 100 గ్రాములు.
మెంతులను దోరగా వేయించి పొడి చేసుకోవాలి. ఆ తర్వాత ఎండిన నేరేడు గింజల పొడి, గుర్మార్ పొడిని మెంతుల పొడితో కలిపి ఈ మూడు పదార్థాలను బాగా మిక్స్ చేయాలి. ఈ విధంగా తయారైన మిశ్రమాన్ని గాలి చొరబడని ఒక శుభ్రమైన గాజు సీసాలో భద్రపరుచుకుంటే ఇది చాలా కాలం పాటు పాడవకుండా సురక్షితంగా ఉంటుంది.
ఈ పొడిని ఎలా , ఎప్పుడు తీసుకోవాలి?
సాధారణంగా ఈ ఆయుర్వేద పొడిని ప్రతిరోజూ ఉదయం పూట ఖాళీ కడుపుతో (పరగడుపున) లేదా రాత్రి భోజనానికి ముందు ఒక టీస్పూన్ మోతాదులో గోరువెచ్చని నీటితో తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అయితే, ప్రతి వ్యక్తి వయస్సు, వారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి , వారు ఇప్పటికే వాడుతున్న అల్లోపతి మందుల (షుగర్ టాబ్లెట్స్ లేదా ఇన్సులిన్) తీవ్రతను బట్టి ఈ పొడి మోతాదు మారే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఈ ఇంటి చిట్కాను మీ దినచర్యలో ప్రారంభించే ముందు ఒకసారి అనుభవజ్ఞుడైన ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవడం తప్పనిసరి.