
CM Chandrababu Naidu: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర పేరుతో భారీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియానికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రి సత్యకుమార్ యాదవ్ స్వాగతం పలికారు. మంత్రి నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకో ప్రత్యేక థీమ్తో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాల్లో యోగాభ్యాసాన్ని ప్రోత్సహిస్తూ యోగాంధ్ర కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టింది. నిన్న ఉండవల్లి గుహల వద్ద ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా నిర్వహించిన యోగా సాధనలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఐజీఎం స్టేడియం విద్యార్థులు, యువతతో నిండిపోవడంతో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్ తదితరులు కూడా పాల్గొన్నారు. యోగాంధ్ర లోగోతో ఉన్న టీషర్ట్ ధరించి సీఎం చంద్రబాబు యోగా సాధనలో పాల్గొన్నారు.
యోగా గురువు రామ్ దేవ్ బాబా మార్గదర్శకత్వంలో సీఎం చంద్రబాబు ప్రాణాయామం చేశారు. అనులోమ, విలోమ పద్ధతుల్లో శ్వాసాభ్యాసం చేస్తూ యోగాసనాల్లో పాల్గొన్నారు. వేదికపై రామ్ దేవ్ బాబా శిష్యులు వివిధ యోగాసనాలను ప్రదర్శించారు. వేంకటేశ్వర సుప్రభాతం, గోవింద నామస్మరణ మధ్య సీఎం యోగాభ్యాసం కొనసాగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో రామ్ దేవ్ బాబాతో కలిసి యోగాభ్యాసం చేయడం మరపురానిదని తెలిపారు. యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తోందని, యోగా ద్వారా దేశ ప్రతిష్ఠ మరింత పెరిగిందని పేర్కొన్నారు.
ప్రస్తుతం 190 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించబడుతోందని.. ప్రపంచానికి భారత్ విశ్వగురువుగా నిలుస్తోందని సీఎం అన్నారు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని, ప్రజలకు యోగాను చేరువ చేసిన రామ్ దేవ్ బాబా కృషి ప్రశంసనీయమని తెలిపారు. రాష్ట్రంలో యోగాభ్యాసాన్ని మరింత విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం ప్రకటించారు. స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లో శాశ్వత యోగా మందిరాలను నిర్మిస్తామని, యోగా కార్యక్రమాల పర్యవేక్షణకు జిల్లా, మండల స్థాయిలో అధికారులను నియమిస్తామని వెల్లడించారు. యోగాంధ్ర కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
అలాగే స్టాండర్డ్ యోగా ప్రోటోకాల్స్ రూపొందించేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేస్తామని, ప్రజలు రోజుకు కనీసం ఒక గంట యోగా, ధ్యానం చేయాలని సూచించారు. జంక్ ఫుడ్ను దూరంగా పెట్టి సహజ ఆహారాన్ని స్వీకరించాలని, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని 50%కి పెంచే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, ఆగస్టు 15 నుంచి సంజీవని ప్రాజెక్టును అమలు చేస్తామని సీఎం వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్లో యోగాను కూడా భాగం చేస్తామని తెలిపారు. ప్రజారోగ్యం మెరుగుపడాలంటే యోగా కీలకమని, ప్రతి ఇంటికీ యోగా చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. యోగాంధ్ర కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన సమాజ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.