Reading Time: < 1 minute
Uddhav Sena Faces Split As Six Rebel Mps Likely To Join Eknath Shinde Camp

Uddhav Shiv sena: మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ రోజు కీలకంగా మారబోతోంది. ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన(యూబీటీ) సంక్షోభం చివరకు చేరింది. ఉద్ధవ్ పార్టీపై తిరుగుబాటు చేసిన ఆరుగురు ఎంపీలు ఆదివారం మీడియా ముందు రాబోతున్నారు. తామెందుకు తిరుగుబాటు చేశామనే వివరాలను మీడియా ముందు వెళ్లడించనున్నారు. ఠాక్రేలు తమ సిద్ధాంతాలకు విరుద్ధంగా ప్రవర్తించడంతో తాము తమ దారి చూసుకోవాల్సి వచ్చిందని ఇప్పటికే ఎంపీలు చెబుతున్నారు.

తిరుగుబాటు ఎంపీలు ఆదివారం సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించి, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో తాము జరిపిన సమావేశానికి సంబంధించిన ఫోటోలు, వీడియో ఫుటేజ్‌ను విడుదల చేయనున్నారు. ఉద్ధవ్ వర్గం నుంచి విడిపోవడానికి గల కారణాలు వెల్లడించే అవకాశం ఉంది. తిరుగుబాటు ఎంపీల్లో సంజయ్ జాదవ్, సంజయ్ దేశ్‌ముఖ్, ఓమ్రాజే నింబాల్కర్, భావుసాహెబ్ వాక్చౌరే, నాగేష్ పాటిల్ అష్టికర్, సంజయ్ దీనా పాటిల్‌‌లు ఉన్నారు.

నేటి సమావేశానికి ఇద్దరు ఎంపీలు చెన్నై నుంచి మరో ఇద్దరు కోల్‌కతా నుంచి ముంబైకి రానున్నారు. ఒక ఎంపీ ఇప్పటికే ముంబైలో ఉండగా, మరొకరు పూణేలో ఉన్నారు. ఈ సమావేశం తర్వాత ఆరుగురు ఎంపీలు డిప్యూటీ సీఎం, శివసేన అధినేత ఏక్‌నాథ్ షిండేను కలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత వీరంతా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో మరో సమావేశాన్ని కోరవచ్చు.