Reading Time: 2 minutes
Nurse Falls At Ministers Feet Seeking Transfer Emotional Scene In Rajasthan

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ నర్సు తన బదిలీ కోసం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గజేంద్ర సింగ్ ఖిన్వ్‌సర్‌ను వేడుకుంటూ ఆయన పాదాల వద్ద కన్నీరు పెట్టుకోవడం కలకలం రేపింది. “సార్.. నేను చాలా బాధలో ఉన్నాను. దయచేసి నా బదిలీకి ఏర్పాట్లు చేయండి” అంటూ ఆమె భావోద్వేగానికి లోనైంది. తాను ప్రస్తుతం పనిచేస్తున్న చోట తీవ్ర ఇబ్బందులు, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నానని ఆ నర్సు తెలిపింది. తన సమస్యలను వివరించి, వెంటనే బదిలీ చేయాలని మంత్రిని పదేపదే కోరింది.

నర్సు ఆవేదనను గమనించిన ఆరోగ్య శాఖ మంత్రి గజేంద్ర సింగ్ ఖిన్వ్‌సర్ ఆమెను ఓదార్చి, బదిలీ విషయంలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సరైన విధానంలో సమస్యను పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఈ ఘటన సమయంలో అక్కడే ఉన్న కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ శెఖావత్ కూడా నర్సును శాంతింపజేశారు. ఆమె ఆందోళన చెందవద్దని, సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు.

స్పైన్ సెంటర్ ప్రారంభోత్సవంలో ఘటన

శనివారం జోధ్‌పూర్‌లోని ఓ స్పైన్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. కార్యక్రమం మధ్యలో నర్సు మంత్రి వద్దకు చేరుకుని తన సమస్యను వివరించడంతో అక్కడ కొంతసేపు భావోద్వేగ వాతావరణం నెలకొంది. మీడియా కథనాల ప్రకారం, స్టాఫ్ నర్స్ సునీతా చౌదరి సికార్ జిల్లాకు చెందినవారు. ఆమె 2020 నుంచి జోధ్‌పూర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. చాలా కాలంగా బదిలీ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

కాంట్రాక్ట్ నర్సుల ఆందోళన

ఇదే కార్యక్రమంలో గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న కాంట్రాక్ట్ నర్సులు కూడా నినాదాలు చేశారు. ఆరోగ్య శాఖ మంత్రి మెడికల్ కాలేజీకి చేరుకున్న సమయంలో వారు తమ డిమాండ్లకు మద్దతుగా నినాదాలు చేశారు. కార్యక్రమం ముగిసిన అనంతరం కూడా నిరసనలు కొనసాగడంతో పోలీసులు వారిని వెనక్కి నెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొన్ని రోజుల క్రితం కాంట్రాక్ట్ నర్సులను విధుల నుంచి తొలగించారని, అప్పటి నుంచి వారు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.