Reading Time: 2 minutes
Iran Closes Strait Of Hormuz Again Lebanon Israel Conflict Oil Shipping Crisis

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యలు కొనసాగడం, గల్ఫ్ ప్రాంతంలో అమెరికా సైనిక బలగాల ఉనికిని కారణంగా చూపుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సముద్ర రేడియో ప్రసారాల ద్వారా విడుదల చేసిన ప్రకటనలో.. ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MoU)లో పేర్కొన్న కీలక షరతులు అమలయ్యే వరకు హార్ముజ్ జలసంధి మూసివేయబడుతుందని వెల్లడించింది.

ఈ ప్రకటన అమెరికా-ఇరాన్ మధ్య ఇటీవల కుదిరిన శాంతి అవగాహన నేపథ్యంలో వచ్చినప్పటికీ.. లెబనాన్‌లో ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య మళ్లీ ఘర్షణలు చెలరేగడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసింది. దీంతో వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య ఏర్పడిన ఉద్రిక్తతల తగ్గింపు ప్రక్రియకు సవాళ్లు ఎదురవుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. IRGC ప్రకారం.. ఇజ్రాయెల్ లెబనాన్ నుంచి పూర్తిగా వైదొలగడం, సముద్ర దిగ్బంధనాన్ని పూర్తిగా ఎత్తివేయడం, పర్షియన్ గల్ఫ్, ప్రాంతం నుంచి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకోవడం వంటి అంశాలు అమెరికా-ఇరాన్ ఒప్పందంలోని ప్రధాన షరతులుగా ఉన్నాయి. అంతేకాకుండా వాణిజ్య నౌకలు, చమురు ట్యాంకర్లు ప్రస్తుతం హార్ముజ్ జలసంధి వైపు రావద్దని ఇరాన్ హెచ్చరించింది. “అన్ని నౌకలు తమ భద్రత దృష్ట్యా హార్ముజ్ జలసంధికి దూరంగా ఉండాలి. ఈ ఆదేశాలను ఉల్లంఘించే ఏ నౌకనైనా లక్ష్యంగా చేసుకుంటాం” అని ప్రకటనలో పేర్కొంది.

అమెరికా-ఇరాన్ ఒప్పందం తర్వాత గత కొన్ని రోజులుగా హార్ముజ్ జలసంధిలో చమురు రవాణా మళ్లీ పుంజుకుంటున్న సమయంలో ఇరాన్ చేసిన తాజా ప్రకటన ప్రపంచ ఇంధన మార్కెట్లలో ఆందోళన కలిగిస్తోంది. హార్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో గణనీయమైన భాగం రవాణా అవుతుండటంతో ఈ పరిణామం అంతర్జాతీయ చమురు ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం జరగడంతో హార్ముజ్ జలసంధి తెరుచుకుంది. దీంతో చమురు ట్యాంకులు రవాణా ప్రారంభించాయి. పరిస్థితులు చక్కబడుతున్నాయని అనుకుంటున్న తరుణంలో ఇరాన్ మళ్లీ ఝలక్ ఇచ్చింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే హార్ముజ్ తెరుస్తామని ప్రకటించింది. అయితే అమెరికా-ఇరాన్ ఒప్పందంతో తమకు సంబంధం లేదని.. దక్షిణ లెబనాన్‌లో ఉన్న హిజ్బుల్లాను అంతం చేయడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ అంటోంది. దీంతో మధ్య ప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.