
శ్రీలంక ఏ జట్టుతో జరిగిన ట్రై-నేషన్ సిరీస్ ఫైనల్లో భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్తో ప్రపంచ రికార్డు సృష్టించాడు. లీగ్ దశలో పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్న 15 ఏళ్ల బీహార్ సంచలనం.. తుది పోరులో కేవలం 29 బంతుల్లో 94 పరుగులు చేసి భారత్ ఏ జట్టు 377/9 భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. గత మ్యాచ్లో లంక ఆటగాళ్లతో గొడవ జరిగినప్పటికీ, ఈ మ్యాచ్లో అతని అద్భుత ఆటతీరును చూసి ప్రత్యర్థి ఆటగాళ్లు సైతం వెన్నుతట్టి అభినందించడం క్రీడాస్ఫూర్తికి నిదర్శనంగా నిలిచింది. దీనిపై సోషల్ మీడియాలో అతడి అభిమానులు సైతం.. వైభవ్ సూర్యవంశీ అంటే అది.. తిట్టిన నోళ్లే జైజైలు కొట్టేలా చేసుకున్నాడు అంటూ పోస్టులు చేస్తున్నారు.
ప్రపంచ రికార్డు బద్దలు..
సూర్యవంశీ కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, లిస్ట్-ఎ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకం నమోదు చేశాడు. దీనితో 2005లో శ్రీలంక ఆటగాడు కౌశల్య వీరరత్నే (12 బంతుల్లో) నెలకొల్పిన 21 ఏళ్ల నాటి రికార్డు స్క్రీన్ నుంచి చెరిగిపోయింది. సూర్యవంశీ ఎదుర్కొన్న మొదటి 11 బంతుల స్కోరు ఇలా ఉంది.. 4, 4, 4, 6, 6, 0, 6, 4, 4, 6, 6.
విధ్వంసకర ఇన్నింగ్స్ హైలైట్స్
ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (39)తో కలిసి సూర్యవంశీ మొదటి వికెట్కు కేవలం 9 ఓవర్లలోనే 132 పరుగులు జోడించాడు. పేసర్లను లక్ష్యంగా చేసుకుంటూ లెగ్ సైడ్, ఆపై ఆఫ్ సైడ్లో మైదానం నలుమూలలా బౌండరీలు బాదాడు. ఎక్స్ట్రా కవర్ మీదుగా అతను కొట్టిన మూడు సిక్సర్లు మ్యాచ్కే హైలైట్గా నిలిచాయి. అత్యంత వేగవంతమైన సెంచరీ వైపు దూసుకెళ్తున్న సూర్యవంశీ.. సహన్ అరాచ్చిగే బౌలింగ్లో మిడ్-ఆఫ్లో క్యాచ్ ఇచ్చి తృటిలో శతకం చేజార్చుకున్నాడు.
THE AURA OF 15 YO SOORYAVANSHI.
From mocking to congratulating – Vaibhav Sooryavanshi answered with his blistering knock of 94.
Sri Lankan players congratulating Vaibhav Sooryavanshi.
pic.twitter.com/z3BR15wlkx
— Maina Singh (@Maina_Singhx77) June 21, 2026
లంక పునరాగమనం ..
ఓపెనర్లు అవుటయ్యాక శ్రీలంక బౌలర్లు మ్యాచ్ను నియంత్రించారు. కెప్టెన్ తిలక్ వర్మ (67), రుతురాజ్ గైక్వాడ్ (40) ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ఆఖర్లో అనుకుల్ రాయ్ (39), విప్రాజ్ నిగమ్ (27) మెరుపులు మెరిపించడంతో భారత్ 350 మార్కును దాటి భారీ స్కోరును బోర్డుపై ఉంచగలిగింది. అయినా, ఈ మ్యాచ్ మొత్తం సూర్యవంశీ విశ్వరూపంతోనే గుర్తుండిపోతుంది.
