
President Murmu AP Visit: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూన్ 30వ తేదీన విశాఖపట్నం రానున్నట్లు ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ టి. శ్రీనివాసన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొంటారని దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 2021 – 26 విద్యా సంవత్సరాల మధ్య వివిధ ప్రోగ్రాంలు పూర్తి చేసుకున్న సుమారు 400 మంది విద్యార్థులకు రాష్ట్రపతి చేతుల మీదుగా డిగ్రీ పట్టాలను అందజేయనున్నారు. ప్రతిభ కనబరిచిన సుమారు 15 మంది విద్యార్థులకు బంగారు పతకాలను కూడా ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతితో పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నట్లు వీసీ తెలిపారు. విశ్వవిద్యాలయం చరిత్రలో ఇది అత్యంత కీలకమైన ఘట్టమని, ఈ కార్యక్రమ ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్నామని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, యూనివర్సిటీ వర్గాలు భద్రత, ప్రోటోకాల్ ఏర్పాట్లను సమీక్షిస్తున్నాయి.