Reading Time: 2 minutes
Sl Captain Sahan Arachchige Praises Vaibhav Sooryavanshi India A Win

భారత్ ‘ఎ’ చేతుల్లో ట్రై-నేషన్ సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి అనంతరం శ్రీలంక ‘ఎ’ జట్టు కెప్టెన్ సహన్ అరాచ్చిగే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆడిన మెరుపు ఇన్నింగ్స్, అలాగే ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లలో భారత్ వేగంగా పరుగులు రాబట్టడమే తమ ఓటమికి ప్రధాన కారణాలని ఆయన అంగీకరించారు.

పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను లాగేసుకున్నాడు..
మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వేడుకలో సహన్ అరాచ్చిగే మాట్లాడుతూ భారత బ్యాటింగ్‌ను, ముఖ్యంగా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని మనస్ఫూర్తిగా అభినందించారు. “పవర్‌ప్లేలో వైభవ్ సూర్యవంశీ నిజంగా ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతని హిట్టింగ్ మా బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టేసింది. ఆరంభంలోనే అతను మ్యాచ్‌ను మా నుంచి దూరం చేశాడు. ఆ తర్వాత మిడిల్ ఓవర్లలో మేము మ్యాచ్‌లోకి తిరిగి రావడానికి ప్రయత్నించినప్పటికీ, చివరి రెండు ఓవర్లు కూడా పూర్తిగా భారత్ వైపు మొగ్గు చూపాయి. అనుకుల్ రాయ్, విప్రాజ్ నిగమ్ ఆఖర్లో వేగంగా పరుగులు జోడించి మాపై మరింత ఒత్తిడి పెంచారు” అని లంక కెప్టెన్ పేర్కొన్నారు.

Vaibhav Sooryavanshi

భారీ ఛేజింగ్‌లో పెద్ద ఇన్నింగ్స్‌లు అవసరం..
378 పరుగుల భారీ లక్ష్య ఛేదనపై అరాచ్చిగే స్పందిస్తూ, “ఇంత పెద్ద స్కోరును ఛేజ్ చేస్తున్నప్పుడు జట్టులో ఒకరిద్దరు బ్యాటర్ల నుంచి భారీ ఇన్నింగ్స్‌లు రావాల్సి ఉంటుంది. మా జట్టులో వనుజ సహన్ (62), సదీర సమరవిక్రమ (52) బాగానే పోరాడారు. కానీ, లక్ష్యం చాలా పెద్దది కావడం వల్ల ఆ పరుగులు సరిపోలేదు. మిడిల్ ఆర్డర్‌లో మరికొన్ని భాగస్వామ్యాలు నెలకొల్పి ఉంటే ఫలితం మరోలా ఉండేది” అని విశ్లేషించారు.

Sfdfeeeeeee

యువ ఆటగాళ్లకు మంచి అనుభవం..
టోర్నమెంట్ ముగింపుపై లంక కెప్టెన్ సంతృప్తి వ్యక్తం చేస్తూ, “ఫైనల్లో ఓడిపోవడం నిరాశ కలిగించినప్పటికీ, ఓవరాల్‌గా ఇదొక మంచి టోర్నమెంట్. మా జట్టులోని యువ ఆటగాళ్లు చాలా బాగా ఆడారు. వారికి సీనియర్ ప్లేయర్స్ నుంచి మంచి మద్దతు లభించింది. పరుగులు సాధించడానికి, యువ ఆటగాళ్లు తమ నైపుణ్యాలను నిరూపించుకోవడానికి ఇదొక అద్భుతమైన ప్లాట్‌ఫారమ్‌గా నిలిచింది. ఈ టోర్నీ ద్వారా నేర్చుకున్న విషయాలు భవిష్యత్తులో మాకు ఎంతగానో ఉపయోగపడతాయి” అని సహన్ అరాచ్చిగే ముగించారు.