Reading Time: < 1 minute
Rishabh Pant Trade Lucknow Super Giants Delhi Capitals Ipl 2027

ఐపీఎల్ 2026 సీజన్ వరకు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్‌గా ఉన్న స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్, తిరిగి తన పాత ఫ్రాంచైజీ అయిన ఢిల్లీ క్యాపిటల్స్‌ గూటికి చేరుకోనున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. పంత్‌ను తిరిగి జట్టులోకి తెచ్చుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే లక్నోతో ట్రేడింగ్ ప్రక్రియను ప్రారంభించింది. ఐపీఎల్ 2027 సీజన్‌లో పంత్ ఢిల్లీ జెర్సీలో కనిపించడం దాదాపు ఖాయమైంది.

2025 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లు వెచ్చించి రిషబ్ పంత్‌ను కొనుగోలు చేసి, కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అయితే.. తాజా ట్రేడింగ్ ఒప్పందం ప్రకారం ఢిల్లీకి మారేందుకు పంత్ తన వేతనంలో భారీ కోతకు అంగీకరించాల్సి ఉంటుందని సమాచారం. ఆర్థికంగా నష్టపోయినప్పటికీ అతను పాత జట్టు వైపే మొగ్గు చూపాడు. అలాగే.. ఢిల్లీ క్యాపిటల్స్‌లో అతనికి కెప్టెన్సీ దక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి.

లక్నో కెప్టెన్సీకి రాజీనామా ఎందుకు?
లక్నో ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా పంత్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ.. ఐపీఎల్ 2025, 2026 సీజన్లలో పంత్ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా ఘోరంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా ఐపీఎల్ 2026లో లక్నో జట్టు పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో (10వ నంబర్) నిలిచింది. ఈ పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ పంత్ ఇటీవలే లక్నో కెప్టెన్సీకి రాజీనామా చేయగా.. యాజమాన్యం దాన్ని ఆమోదించింది. మొదట ఆటగాడిగా లక్నోలోనే కొనసాగుతాడని భావించినప్పటికీ, పంత్ ఢిల్లీ వైపు మొగ్గు చూపాడు.

ఢిల్లీ క్యాపిటల్స్‌లో కొత్త సమీకరణాలు..
రిషబ్ పంత్ రాకతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్‌లోనూ భారీ మార్పులు జరుగుతున్నాయి. టీమిండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ ఢిల్లీ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనుండగా.. సౌరవ్ గంగూలీ క్రికెట్ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు. యువరాజ్, గంగూలీ వంటి దిగ్గజాల మార్గదర్శకత్వంలో పాత జట్టులోకి తిరిగి వస్తున్న పంత్.. రాబోయే సీజన్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి.