
హైదరాబాద్లోని రాజేంద్రనగర్ పోలీసుల అప్రమత్తత, మానవత్వం మరోసారి ప్రాణాలను కాపాడింది. జూన్ 18న తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్వాస ఆగిపోయి స్పృహ కోల్పోయిన ఏడాది వయసున్న పసికందును పోలీసులు సీపీఆర్ (కార్డియోపల్మోనరీ రిససిటేషన్) చేసి ప్రాణాపాయం నుంచి బయటపడేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సమాచారం ప్రకారం, రాజేంద్రనగర్ డీసీపీ ఎస్. శ్రీనివాస్ తన బృందంతో కలిసి రాత్రి గస్తీ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో శంషాబాద్-ఆరామ్ఘర్ రహదారిపై ఒక కారు ప్రమాదానికి గురైనట్లు గుర్తించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్కు వస్తున్న కుటుంబం ప్రయాణిస్తున్న కారు డ్రైవర్కు నిద్రమత్తు రావడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే డీసీపీ శ్రీనివాస్, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో ఉన్న కుటుంబ సభ్యులను బయటకు తీసే క్రమంలో ఏడాది వయసున్న బాలుడు శ్వాస తీసుకోకపోవడం, స్పృహ కోల్పోవడం గమనించారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
అయితే పరిస్థితిని చాకచక్యంగా అంచనా వేసిన పోలీసులు వెంటనే బాలుడికి సీపీఆర్ అందించారు. కొన్ని క్షణాల తర్వాత బాలుడు తిరిగి శ్వాస తీసుకోవడం ప్రారంభించడంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం ఆ కుటుంబాన్ని సమీప ఆసుపత్రికి సురక్షితంగా తరలించి వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు.
ఈ ఘటనపై స్పందించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, డీసీపీ శ్రీనివాస్తో పాటు పోలీసు బృందాన్ని అభినందించారు. తమ విధిని నిర్వర్తించడమే కాకుండా ఒక అమూల్యమైన ప్రాణాన్ని కాపాడి మానవత్వాన్ని చాటిచెప్పారని కొనియాడారు. అలాగే సుదూర ప్రయాణాల్లో డ్రైవర్లు నిద్రమత్తుగా అనిపిస్తే తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
వైరల్ వీడియో ఇక్కడ చూడండి..
రోడ్డు ప్రమాదంలో అపస్మారక స్థితికి చేరిన రెండున్నరేళ్ల బాలుడికి సకాలంలో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, వారి కానిస్టేబుళ్ల బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
ఈ నెల 18వ తేదీ అర్ధరాత్రి 2 గంటల సమయంలో శంషాబాద్-ఆరాంఘర్ మార్గంలో ఒకకారు ప్రమాదానికి… pic.twitter.com/SICddSAE9T
— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) June 20, 2026
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..