Reading Time: < 1 minute
Kodali Nani Prosecution Approved By Ap Government Over Election Code Violation Case

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొడాలి నానిపై నమోదైన కేసులో ప్రాసిక్యూషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పంచాయతీ ఎన్నికల సమయంలో అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యల వ్యవహారంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ఇది ఎన్నికల నిబంధనల అమలులో భాగమని అధికార వర్గాలు చెబుతుండగా.. మరోవైపు రాజకీయ కక్షసాధింపులో భాగమనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

2021లో రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల సమయంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. ఈ అంశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. కొడాలి నాని వ్యాఖ్యలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించాయని భావించిన రాష్ట్ర ఎన్నికల సంఘం సంయుక్త కార్యదర్శి.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా ఎస్పీకి నివేదిక పంపించారు. ఆ నివేదిక ఆధారంగా పోలీసులు 2021లోనే స్థానిక న్యాయస్థానం అనుమతి తీసుకుని కేసు నమోదు చేశారు.

కేసు నమోదైన సమయంలో కొడాలి నాని రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. చట్ట ప్రకారం ప్రజాప్రతినిధులు లేదా మంత్రులపై విధుల నిర్వహణకు సంబంధించిన అంశాల్లో విచారణ లేదా ప్రాసిక్యూషన్ చేపట్టాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఈ కారణంగా కేసు తదుపరి దశకు వెళ్లకుండా నిలిచిపోయింది. తాజాగా కృష్ణా జిల్లా కలెక్టర్ పంపిన నివేదికను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం.. కొడాలి నానిపై ప్రాసిక్యూషన్ కొనసాగించేందుకు అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ అధికారికంగా ఆమోదం తెలిపారు. దీంతో కొడాలి నానిపై నమోదైన కేసులో న్యాయపరమైన ప్రక్రియలు మరింత వేగంగా ముందుకు సాగే అవకాశం ఏర్పడింది.