Reading Time: < 1 minute
Apl 2026 Semifinals And Final To Be Held At Mangalagiri Stadium Kesineni Chinni

APL 2026: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు కేశినేని చిన్ని ఏపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణపై కీలక వివరాలు వెల్లడించారు. జూన్ 24 నుంచి 30 వరకు మంగళగిరి స్టేడియంలో ఏపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయని తెలిపారు. కడపలో జరిగిన మ్యాచ్‌లకు మంచి స్పందన లభించిందని చెప్పారు. ఏపీఎల్ సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లను మంగళగిరి స్టేడియంలో నిర్వహించనున్నట్లు కేశినేని చిన్ని వెల్లడించారు. స్టేడియంలో సుమారు 10 వేల మంది ప్రేక్షకులు మ్యాచ్‌లను వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

ప్రేక్షకులకు ఉచిత రవాణాపై ఆలోచన

మ్యాచ్‌లను వీక్షించేందుకు వచ్చే అభిమానుల కోసం ఉచిత రవాణా సదుపాయం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు కేశినేని చిన్ని.. ఈ విషయంపై ఆర్టీసీ అధికారులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇక, ఏపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని కేశినేని చిన్ని తెలిపారు. ఈ టోర్నీని మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

మంగళగిరిలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌కు ప్రణాళిక

భవిష్యత్‌లో మంగళగిరి స్టేడియంలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మ్యాచ్‌లు నిర్వహించే ఆలోచన కూడా ఉందన్నారు. విశాఖ స్టేడియంకు ఏమాత్రం తీసిపోకుండా మంగళగిరి స్టేడియాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో అమరావతిలో స్పోర్ట్స్ సిటీ అభివృద్ధి చేసి, అంతర్జాతీయ మ్యాచ్‌లకు అనువైన స్టేడియాన్ని నిర్మించనున్నట్లు కేశినేని చిన్ని వెల్లడించారు. అలాగే తిరుపతి, కాకినాడలో కూడా కొత్త స్టేడియాల నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు.