
ఐపీఎల్ 2027 సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) ఫ్రాంచైజీలో భారీ మార్పులు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. భారత స్టార్ వికెట్కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ డీసీ గూటికి తిరిగి చేరనున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) తరఫున ఆడుతున్న పంత్ను తిరిగి డీసీలోకి తీసుకురావడానికి కీలక ఒప్పందం దాదాపు పూర్తయిందని సమాచారం. ఈ ట్రేడ్లో భాగంగా భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో జట్టులోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
రిషభ్ పంత్ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్లో చేరనున్న నేపథ్యంలో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ భవిష్యత్తుపై చర్చ మొదలైంది. ఈ క్రమంలో మాజీ భారత ఫాస్ట్ బౌలర్ దొడ్డ గణేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రిషభ్ పంత్ ఢిల్లీకి తిరిగి వస్తే కేఎల్ రాహుల్ ఫ్రాంచైజీని వీడి వేలంలోకి వెళ్లాలి’ అని సోషల్ మీడియాలో అభిప్రాయపడ్డారు. వేలంలో అతడికి మంచి ధర పలికే అవకాశాలు ఉన్నారన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఐపీఎల్ 2026 సీజన్లో పంత్, రాహుల్ ప్రదర్శనలు బిన్నంగా ఉన్నాయి. రూ.27 కోట్ల భారీ ధరకు లక్నో జట్టులో చేరిన పంత్ 14 మ్యాచ్ల్లో కేవలం 312 పరుగులు మాత్రమే చేశాడు. అతని నాయకత్వంలో ఎల్ఎస్జీ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. సీజన్ ముగిసిన అనంతరం పంత్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నాడు. మరోవైపు రాహుల్ 14 మ్యాచ్ల్లో 593 పరుగులు సాధించి జట్టుకు కీలక ఆటగాడిగా నిలిచాడు. అతని స్ట్రైక్రేట్ 174.41గా ఉండగా..పంజాబ్ కింగ్స్పై అజేయంగా 152 పరుగులు చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమానులైన జేఎస్డబ్ల్యూ గ్రూప్, జీఎంఆర్ గ్రూప్ రెండేళ్ల చొప్పున జట్టు నిర్వహణ బాధ్యతలు చేపడుతుంటాయి. 2027 నుంచి మళ్లీ జేఎస్డబ్ల్యూ గ్రూప్ నిర్వహణ బాధ్యతలు స్వీకరించనుంది. దీంతో ఫ్రాంచైజీలో కోచింగ్ విభాగంతో పాటు క్రికెట్ కార్యకలాపాల్లోనూ కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ బృందంలో చేరనున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ విజేతగా గుర్తింపు పొందిన యువరాజ్ అనుభవం యువ ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడనుంది. ముఖ్యంగా పంత్తో యువరాజ్కు ఇప్పటికే మంచి అనుబంధం ఉండటం ఈ నిర్ణయానికి బలం చేకూర్చుతోంది.
మాజీ భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ వ్యవహారాల అధిపతిగా తిరిగి బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. గతంలో జేఎస్డబ్ల్యూ నిర్వహణలో గంగూలీ కీలక పాత్ర పోషించాడు. అతని నాయకత్వంలో ఫ్రాంచైజీ పలు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడు మళ్లీ అతని రాకతో డీసీ కొత్త దిశగా అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. గత రెండు సీజన్లుగా ఢిల్లీ హెడ్ కోచ్గా ఉన్న హేమంగ్ బదానీ భవిష్యత్తు కూడా అనిశ్చితంగా మారింది. వరుసగా రెండు సీజన్లలో జట్టు ప్లేఆఫ్స్కు అర్హత సాధించకపోవడంతో కోచింగ్ విభాగంలో మార్పులు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు. 2026 సీజన్లో డీసీ ఆరో స్థానంతో సరిపెట్టుకోవడం యాజమాన్యాన్ని అసంతృప్తికి గురి చేసినట్లు తెలుస్తోంది. పంత్ తిరిగి ఢిల్లీలో చేరడం, యువరాజ్ కోచింగ్ బృందంలోకి రావడం, గంగూలీ తిరిగి కీలక బాధ్యతలు చేపట్టడం వంటి పరిణామాలు ఐపీఎల్ 2027కు ముందు డీసీని మరోసారి వార్తల్లో నిలిపాయి.