
ఐపీఎల్ 2026 సీజన్ జమ్మూ కాశ్మీర్ ఫాస్ట్ బౌలర్ రాసిఖ్ సలామ్కు ఒక గొప్ప గుర్తింపును తెచ్చిపెట్టింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున ఈ సీజన్లో 19 వికెట్లు పడగొట్టి, జట్టు టైటిల్ డిఫెన్స్లో కీలక పాత్ర పోషించాడు. సాధారణంగా కొత్త బంతితో బౌలింగ్ చేయడానికి ఇష్టపడే రాసిఖ్కు, ఆర్సీబీ యాజమాన్యం ఈ ఏడాది భిన్నమైన బాధ్యతలను అప్పగించింది. పవర్ప్లే, మిడిల్ ఓవర్లు, డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయాల్సి ఉంటుందని కోచ్లు ముందే స్పష్టం చేశారు. దీంతో భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్ వంటి సీనియర్లపై పవర్ప్లే భారం ఉండగా.. రాసిఖ్ తన వైవిధ్యాలపై దృష్టి పెట్టాడు. ఫ్లాట్ వికెట్లపై కేవలం లెంగ్త్ బంతులు వేస్తే భారీగా పరుగులు సమర్పించుకోవాల్సి వస్తుందని గ్రహించి, యార్కర్లు, స్లోయర్ బౌన్సర్లు, బ్యాక్-ఆఫ్-ది-హ్యాండ్ డెలివరీలను ప్రాక్టీస్ చేశాడు.
గతాన్ని అధిగమించి..
2019లో ముంబై ఇండియన్స్తో ఐపీఎల్ ప్రయాణాన్ని ప్రారంభించిన రాసిఖ్, ఆ తర్వాత వయస్సు వివాదంలో రెండేళ్ల నిషేధాన్ని, గాయాలను ఎదుర్కొన్నాడు. 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 9 వికెట్లు తీసి పునరాగమనం చేశాడు. ఆ అనుభవంతో డెత్ ఓవర్లలో యార్కర్ల ప్రాధాన్యతను తెలుసుకున్నాడు. 2025లో బెంచ్కే పరిమితమైనా, రూ. 6 కోట్లకు కొనుగోలు చేసిన ఆర్సీబీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని పట్టుదలగా శ్రమించాడు.
కీలక వికెట్లు..
ఈ సీజన్లో ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, శ్రేయస్ అయ్యర్ల వికెట్లు తనకిష్టమైనవని రాసిఖ్ తెలిపాడు. ముఖ్యంగా అయ్యర్ను పక్కా ప్రణాళికతో హార్డ్ లెంగ్త్ బంతితో అవుట్ చేసిన విధానాన్ని గుర్తుచేసుకున్నాడు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు పిచ్ ప్రవర్తనను బట్టి క్రాస్-సీమ్, స్క్రాంబుల్డ్ సీమ్ బంతులు వేయాలని భువనేశ్వర్, హేజిల్వుడ్ ఇచ్చిన సలహాలు తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పాడు. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో సీనియర్ల నుంచి అంటే ముఖ్యంగా విరాట్ కోహ్లీ దగ్గర నేర్చుకున్నానని పేర్కొన్నాడు. ఇది తనకు ఎంతో ఉపయోగపడిందని తెలిపాడు.