Reading Time: < 1 minute
Akshara Gupta Smashes Unbeaten 306 In Bihar U 19 Womens Odi Trophy Record Triple Century

Akshara Gupta: బీహార్ మహిళల అండర్-19 వన్డే ట్రోఫీ టోర్నమెంట్‌లో బ్యాటర్ అక్షర గుప్తా అరుదైన ఘనత సాధించింది. గురువారం భాగల్పూర్‌ లోని సండిస్ కాంపౌండ్ మైదానంలో జరిగిన టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆమె అజేయంగా 306 పరుగులు చేసి చరిత్రలో తన పేరును లిఖించుకుంది. మహిళల దేశీయ క్రికెట్ చరిత్రలోనే అత్యున్నత వ్యక్తిగత స్కోర్లలో ఒకటిగా ఈ ఇన్నింగ్స్ నిలిచింది.

మ్యాచ్ మొదటి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన అక్షర గుప్తా.. కేవలం 126 బంతుల్లోనే 306 పరుగులు సాధించింది. ఆమె ఇన్నింగ్స్‌లో 55 ఫోర్లు, 8 సిక్సర్లతో 242.86 స్ట్రైక్‌రేట్‌తో 233 నిమిషాల పాటు క్రీజులో నిలిచి ప్రత్యర్థి జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ట్రిపుల్ సెంచరీ సాధించింది. అక్షర ఇన్నింగ్స్‌లో కేవలం 16 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేయగా, 34 బంతుల్లో శతకం సాధించింది. ఆ తర్వాత కూడా అదే దూకుడును కొనసాగిస్తూ త్రిశతకాన్ని అందుకుని సంచలనం సృష్టించింది. ఈ దెబ్బతో బీహార్ మహిళల క్రికెట్‌లో కొత్త రికార్డును నెలకొల్పింది.

అక్షర గుప్తా అద్భుత ఇన్నింగ్స్‌పై బీహార్ క్రికెట్ అసోసియేషన్ (BCA) అధికారులు ప్రశంసలు కురిపించారు. బీసీఏ అధ్యక్షుడు హర్షవర్ధన్ మాట్లాడుతూ.. బీహార్ మహిళా క్రికెటర్లు తమ ప్రతిభతో రాష్ట్రానికి పేరు తీసుకువస్తున్నారని కొనియాడారు. బీసీఏ కార్యదర్శి జియౌల్ అర్ఫిన్ కూడా అక్షరను అభినందిస్తూ.. టోర్నమెంట్ ప్రారంభంలోనే ఇలాంటి ప్రతిభ వెలుగులోకి రావడం బీహార్ క్రికెట్ భవిష్యత్తుకు శుభసూచకమని అన్నారు.