
ప్రస్తుతం దేశంలో ఫిరాయింపు రాజకీయాలు నడుస్తున్నాయి. తొలుత పశ్చిమ బెంగాల్తో మొదలైన ఫిరాయింపులు మహారాష్ట్రకు వచ్చాయి. ఇప్పుడు అక్కడ నుంచి ఉత్తరప్రదేశ్కు పాకింది. సమాజ్వాదీ పార్టీలో భారీ చీలిక జరగవచ్చని సంకేతాలు వెలువడుతున్నాయి. ఎస్పీలోని కొందరు నేతలు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారని.. పార్టీ అంతర్గత తిరుగుబాటు బల్లియాలోనే ప్రారంభమవుతుందని మంత్రి ఓం ప్రకాష్ రాజ్భర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్పీ ఎంపీ రాజీవ్ రాయ్ ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారని.. ఆయనే పార్టీ అంతర్గత తిరుగుబాటుకు నాయకత్వం వహించవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పార్టీని కాపాడుకోవడానికి అఖిలేష్ యాదవ్ భవిష్యత్తులో నాయకత్వం నుంచి తప్పుకోవాల్సి రావచ్చని.. ఆ స్థానంలో శివపాల్ సింగ్ యాదవ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. బల్లియా జిల్లాలో మీడియాతో మాట్లాడిన మంత్రి రాజ్భర్.. సమాజ్వాదీ పార్టీ కూడా ఉద్ధవ్ థాక్రే, అలాగే మమతా బెనర్జీ పార్టీల మాదిరిగానే చీలిపోయే పరిస్థితి ఎదుర్కొంటోందని ఆరోపించారు. ఎస్పీలోని కొందరు నేతలు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారని, పార్టీ అంతర్గత తిరుగుబాటు బల్లియాలోనే ప్రారంభమవుతుందని వ్యాఖ్యానించారు.
అఖిలేష్ యాదవ్, శివపాల్ సింగ్ యాదవ్ మధ్య సంబంధాలపై కూడా రాజ్భర్ విమర్శలు చేశారు. తన బాబాయిని అఖిలేష్ పార్టీ వ్యవహారాల్లో పక్కన పెట్టారని.. గతంలో అసెంబ్లీలో శివపాల్ పార్టీకి చెందిన వారేనా అనేలా వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తుచేశారు. ‘‘రాబోయే రోజుల్లో పార్టీని కాపాడుకోవాలంటే అఖిలేష్ యాదవ్ తప్పుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత శివపాల్ సింగ్ యాదవ్ పార్టీకి నాయకత్వం వహిస్తారు” అని రాజ్భర్ వ్యాఖ్యానించారు.
ఇటీవల రాజ్భర్-సమాజ్వాదీ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం అఖిలేష్ యాదవ్ తన ఎంపీలను కాపాడుకునేందుకు ప్రత్యేక ప్రచారం చేపట్టాలని రాజ్భర్ సూచించగా.. అఖిలేష్ ఆయనను “పుకార్లు ప్రచారం చేసే మంత్రి”గా విమర్శించారు. మరోవైపు రాజీవ్ రాయ్ కూడా రాజకీయ ప్రాధాన్యం కోసం రాజ్భర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.
ఇక తన పార్టీ ఎస్బీఎస్పీలో విభేదాలు ఉన్నాయన్న ప్రచారాన్ని కూడా రాజ్భర్ ఖండించారు. తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలలో ఐదుగురు ఇప్పటికీ తనతోనే ఉన్నారని, కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే బహిరంగంగా సమాజ్వాదీ పార్టీ జెండాలతో కనిపిస్తున్నారని తెలిపారు. అయితే ఇటీవల ఆయన కుమారుడు అరుణ్ రాజ్భర్ ముగ్గురు ఎస్బీఎస్పీ ఎమ్మెల్యేలు సమాజ్వాదీ పార్టీ జెండాలతో తిరుగుతున్నారని వ్యాఖ్యానించడంతో పార్టీలోనూ విభేదాలపై ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం రాజ్భర్ చేసిన తాజా వ్యాఖ్యలు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.