
Siddipet District: సిద్దిపేట జిల్లాలో మానవత్వాన్ని మంటగలిపే అత్యంత ఘోరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. కన్నప్రేమను మరచి, కామంధుడైన ప్రియుడి కోసం ఒక కసాయి తల్లి చేసిన దారుణం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ప్రియుడితో ఏకాంతంగా ఉన్న సమయంలో అడ్డువచ్చాడని, ఏడుస్తున్నాడనే కక్షతో కేవలం రెండేళ్ల వయసున్న కన్న కుమారుడిని అత్యంత దారుణంగా హత్య చేసింది. ఆపై బాబు ఫిట్స్తో చనిపోయాడంటూ భర్తను, బంధువులను నమ్మించి గుట్టుచూడకుండా అంత్యక్రియలు సైతం కానిచ్చేసింది. అయితే, పాపం పండినట్లు సరిగ్గా 20 రోజుల తర్వాత ఈ కసాయి తల్లి బాగోతం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.
పోలీసుల కథనం ప్రకారం.. మేడ్చల్ జిల్లా కీసరలో నివాసముంటున్న సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగుల్ గ్రామానికి చెందిన స్వామి, జ్యోతి దంపతులకు నాలుగేళ్ల కూతురు, రెండేళ్ల కుమారుడు హరికృష్ణ ఉన్నారు. స్వామి క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, జ్యోతికి పెళ్లి కాకముందు నుంచే యాదాద్రి భువనగిరి జిల్లా మాదాపూర్ గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. భర్త స్వామి క్యాబ్ డ్రైవింగ్కు వెళ్లడమే ఆలస్యం.. నవీన్ నేరుగా జ్యోతి ఇంటికి వచ్చి వెళ్లేవాడు. గత నెల 29న కూడా స్వామి డ్యూటీకి వెళ్లగానే నవీన్ జ్యోతి దగ్గరకు వచ్చాడు. ఆ సమయంలో ఇద్దరూ ఏకాంతంగా గడుపుతుండగా, రెండేళ్ల బాబు హరికృష్ణ గట్టిగా ఏడవడం ప్రారంభించాడు. దీంతో జ్యోతి ప్రియుడు నవీన్ తీవ్ర చిరాకు పడ్డాడు. “ఈ రెండేళ్ల కొడుకు నాకు నచ్చలేదు, వీడిని చంపేద్దాం” అంటూ నవీన్ కసితో జ్యోతితో అన్నాడు. దానికి ఆ కన్నతల్లి కూడా ఏమాత్రం వెనుకాడకుండా పచ్చ జెండా ఊపింది. అంతే.. ఇద్దరూ కలిసి ఏడుస్తున్న ఆ పసికందును అత్యంత క్రూరంగా నేలకేసి కొట్టారు. దీంతో తలకు తీవ్ర గాయమై ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
బాబు చనిపోయిన తర్వాత నాటకమాడిన జ్యోతి.. భర్త స్వామి ఇంటికి రాగానే బాబుకు అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చి చనిపోయాడంటూ ఏడ్చింది. భార్య మాటలను నిజమేనని నమ్మిన స్వామి, కుటుంబ సభ్యులు కలిసి ఆ చిన్నారి మృతదేహాన్ని కీసర నుంచి తమ స్వగ్రామమైన తీగుల్కు తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే, ఆ తర్వాత నుంచి జ్యోతి ప్రవర్తనలో మార్పు రావడం, ఆమె తీరుపై భర్త స్వామికి తీవ్ర అనుమానం రావడంతో కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమెను గట్టిగా నిలదీశాడు. భర్త, బంధువుల ఒత్తిడి తట్టుకోలేక తనే ప్రియుడితో కలిసి కొడుకును చంపేసినట్లు జ్యోతి నిజం ఒప్పుకుంది. దీంతో దిగ్భ్రాంతికి గురైన భర్త కీసర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కీసర పోలీసుల సమక్షంలో బాలుడి మృతదేహాన్ని పూడ్చిన చోటు నుంచి వెలికితీసి రీ-పోస్టుమార్టం నిర్వహించారు. కన్నకొడుకును పొట్టనబెట్టుకున్న కసాయి తల్లి జ్యోతిని పోలీసులు అరెస్ట్ చేయగా, ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రియుడు నవీన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.