Reading Time: < 1 minute
Gandhi Sarovar Project Defence Ministry Clearance Musi Revival

Gandhi Sarovar Project : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్లాగ్‌షిప్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ నుండి కీలక అనుమతులు లభించాయి. హైదరాబాద్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాపు ఘాట్ వద్ద నిర్మించతలపెట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ పనులకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కీలకమైన క్లియరెన్స్ లభించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో సహకరించి, అనుమతులు మంజూరు చేసినందుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర రక్షణ శాఖ , ఇండియన్ ఆర్మీకి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మూసీ పునరుజ్జీవనంలో కీలక మైలురాయి

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ నది పునరుజ్జీవనం (మూసీ ప్రక్షాళన), రివర్‌ఫ్రంట్ అభివృద్ధి విజన్‌లో గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు అనుమతులు రావడం ఒక కీలక మైలురాయి అని అభివర్ణించారు. బాపు ఘాట్ పరిసర ప్రాంతాలలో ఈ ప్రాజెక్ట్ పనులు ప్రారంభం కావడం వల్ల మూసీ పరివాహక ప్రాంత రూపురేఖలు మారిపోతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

పర్యావరణ, సాంస్కృతిక కేంద్రంగా మార్చడమే లక్ష్యం

మూసీ నది పరివాహక ప్రాంతాన్ని కేవలం ఒక నదిలా కాకుండా.. అద్భుతమైన పర్యావరణ, సాంస్కృతిక , గొప్ప ప్రజా ఆస్తిగా (పబ్లిక్ అసెట్) మార్చడమే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా హైదరాబాద్ నగరానికి ఒక సరికొత్త పర్యాటక హంగులు తోడవుతాయని, పర్యావరణ రక్షణకు కూడా ఇది ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. కేంద్ర రక్షణ శాఖ ఇచ్చిన ఈ గ్రీన్ సిగ్నల్‌తో గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ పనులు మరింత వేగంగా ముందుకు సాగనున్నాయి.